‘పోలవరం, హంద్రీనీవా వైఎస్ జగన్తోనే సాధ్యం’
సాక్షి, అనంతపురం : పోలవరం, హంద్రీనీవా ప్రాజెక్టుల నిర్మాణాలైనా.. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన అయినా వైఎస్ జగన్తోనే సాధ్యమని జేఎన్టీయూ మాజీ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. అనంతపురంలో ఆదివారం జరిగిన ‘వై ఆంధ్రప్రదేశ్ నీడ్స్ జగన్’ అనే చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కేంద్రంతో కొట్లాడితేనే ప్రత్యేక హోదా సాధించవచ్చునని తెలిపారు. ఎన్ని సమస్యలెదురైనా వెనకడుగు వేయకుండా రాష్ట్రం కోసం పాటుపడడం వైఎస్ జగన్కే సాధ్యమని పేర్కొన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు నెరవేర్చడానికి వైఎస్ జగన్ పనిచేస్తారనే నమ్మకం ఉందని అన్నారు. పోలవరం, హంద్రీనీవా ప్రాజెక్టుల నిర్మాణం జరగాలంటే వైఎస్ జగన్ అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలపై వైఎస్ జగన్కు ఉన్న ప్రేమే వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసేలా ప్రోత్సహిస్తోందని అన్నారు.
రాష్ట్రాభివృద్ధి కోసం పరితపించే వైఎస్ జగన్ నాయకత్వం ఆంధ్రప్రదేశ్కు అవసరమని చెప్పారు. ఎన్నికల్లో గెలవడానికి అడ్డగోలు హామీలివ్వకుండా .. తాను చేయగలిగినవి మాత్రమే చెప్తున్న వైఎస్ జగన్ వాస్తవికవాది అని వ్యాఖ్యానించారు. కాపులకు రిజర్వేషన్ల అంశంపై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల్ని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రశంసించిన విషయాన్ని ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి గుర్తు చేశారు. ‘కాపుల రిజర్వేషన్ల అంశంపై వైఎస్ జగన్ రాజకీయ నాయకుడిగా కంటే వాస్తవికవాదిగా మాట్లాడారు’ అని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ నేత ఆర్. కృష్ణయ్య వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.