నేను మిమ్మల్నే నమ్ముకున్నా: జీవన్‌రెడ్డి

Jeevan Reddy Criticize On KCR Jagtial - Sakshi

సాక్షి, జగిత్యాల: ‘ప్రతిసారి నేను మిమ్మల్నే నమ్ముకున్నా.. ఇప్పుడూ నమ్ముతున్నా.. 40 ఏళ్లుగా మీరు నన్ను ఆదరిస్తున్నారు.. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను. వచ్చే ఎన్నికల్లో ఓడినా.. గెలిచినా మీ తోనే ఉంటా’ అని జగిత్యాల తాజా మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి ఓటర్లు.. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. జిల్లాకేంద్రంలోని బండారు గార్డెన్స్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన జగిత్యాల మండల కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త ఓ సైనికుడిగాలా పనిచేయాలన్నారు.

తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం కదంబ హస్తాల్లో బందీ అయిందని పేర్కొన్నారు. విముక్తి కల్పించేందుకే మహా కూటమి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయని ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కడితే సీఎం కేసీఆర్‌ తొమ్మిది నెలల ముందే చేతులెత్తేశారని అన్నారు. అస్త్రసన్యాసం చేసిన టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులకు మళ్లీ ఓట్లు అడిగే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లు రాష్ట్రంలో కొనసాగిన నిరంకుశ పాలనను అంతమొందించేందుకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ ఏకమయ్యాయన్నారు. 2014లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన మన ఊరు– మన ప్రణాళిక కార్యాచరణ ఏమైందని ప్రశ్నించారు. గ్రామజ్యోతి ఏ మేరకు వెలుగు ఇచ్చిందన్నారు.  నాలుగున్నరేళ్ల కాలంలో స్థానిక సంస్థను నిర్వీర్యం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఆంధ్ర దళారుల కోసమే సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం అమలు చేశారని ఆరోపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top