కొన్ని చానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి: జనసేన
సాక్షి, విజయవాడ : జనసేన పార్టీపై కొన్ని చానళ్లు పనికట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ అధినేత పవన్ కల్యాణ్ ఓ జాతీయ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెనుకబడిన ప్రాంతాలకు ఎక్కువ నిధులు కేటాయించాలని మాత్రమే చెప్పారని, కానీ ఈ మాటలను వక్రీకరించి కొన్ని చానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. హోదా విషయంలో జనసేన వెనక్కి తగ్గదని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తమ అధినేత ఏ త్యాగానికైన సిద్దంగా ఉన్నాడని స్పష్టం చేశారు.
ఆంధ్ర ప్రజలు ఓ సారి తమ గళం విప్పితే దేశ రాజకీయాలు పూర్తిగా మారిపోతాయన్నారు. పవన్ కల్యాణ్ హోదా కోసం పోరాటం చేస్తారని తెలిపారు. 22న జరిగే జాతీయ రహదారుల దిగ్భందనంపై తమ అధినేత నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని, జనసేన నాయకులు, కార్యకర్తలకు ఎక్కువ సమయం అవసరం లేదని, పిలుపు వచ్చిన కొద్ది సమయంలోనే ఉద్యమించటాని సిద్దంగా ఉంటారని ఆయన పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు