మహిళా అధికారిని కొట్టినా చర్యలేవి: పవన్ కల్యాణ్
సాక్షి, విజయవాడ : రాజధాని పేరుతో అడ్డగోలుగా భూములను దోపిడీ చేశారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఓ ఎమ్మెల్యే మహిళా అధికారిణి కొట్టినా చర్యలు తీసుకోలేదని తప్పుబట్టారు. ఇలాంటి ఎమ్మెల్యేలు రేపు మంత్రులు కూడా అవుతారని, ఇటువంటి వ్యవస్థను తప్పుబట్టాలని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నీరు కలుషితమైందని, పర్యావరణాన్ని పట్టించుకోవడం లేదని, గోదావరి జిల్లాలో నదీజలాలు కూడా కలుషితమయ్యాయని అన్నారు. ఎన్నికల తరువాత 1850 ఎకరాలు మాత్రమే సేకరిస్తామని చంద్రబాబు తనతో చెప్పారని, ఇది కాస్తా లక్ష ఎకరాలకు పెరిగిపోయిందని అన్నారు. లక్ష ఎకరాలు సేకరించి, పర్యావరణాన్ని విధ్వంసం చేసి, రాజధానిని ఎప్పుడు నిర్మిస్తారు? అని ప్రశ్నించారు.
అడ్డగోలుగా భూములను దోపిడీ చేస్తారా? ప్రశ్నించేవారు లేరనుకుంటున్నారా? తోలు తీస్తామని చంద్రబాబును పవన్ హెచ్చరించారు. మహారాష్ట్ర తరహాలో రైతు, ప్రజా పోరాటం చేస్తామని, రాష్ట్రం నలుమూలల నుంచి రాజధానికి తరలివచ్చి.. ముఖ్యమంత్రి ఇంటి ముందు కూర్చుంటామని, రాజధానిని ఆపేస్తామని పవన్ అన్నారు. ‘ముఖ్యమంత్రి మా రాజుకాదు. చంద్రబాబుది సొంత రాష్ట్రం కాదు.. ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదు. అధికారులు కూడా సీఎం చెప్పారని ఏదిపడితే అది చేయవద్దు’ అని అన్నారు.