సిద్దిపేటను మీరే చూసుకోండి

Harish Rao comments at the party activists meeting - Sakshi

పార్టీ కార్యకర్తల సమావేశంలో హరీశ్‌రావు

సాక్షి, సిద్దిపేట: ‘ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని నిరంతరంగా ముందుకు సాగించేందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నాం. పార్టీని గెలిపించడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో నా బాధ్యత చాలా ఉంది. అందుకే నియోజకవర్గం విషయాన్ని మీరే చూసుకోండి’అని రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు కార్యకర్తలకు చెప్పారు. సోమవారం సిద్దిపేట అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్యాలయంలో నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య కార్యకర్తలతో హరీశ్‌రావు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోరాడి సాధించున్న తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలంటే తిరిగి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావాలని అన్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ తనపై పెట్టిన బాధ్యతను నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం తాను రాష్ట్రంలోని నాలుగు ఐదు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేయాల్సి ఉంటుందన్నారు. పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో సిద్దిపేటకు ఎక్కువ సమయం కేటాయించలేక పోవచ్చని, మీరే అన్ని చూసుకొని ప్రచారం చేయాలని మంత్రి కార్యకర్తలను కోరారు.  సమావేశంలో సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ కడవరుగు రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు మాణిక్‌రెడ్డి, సాయిరాం పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top