అది టీపీసీసీ కాదు.. తెలుగుదేశం పీసీసీ
బాబు మీట నొక్కితే ఉత్తమ్ నటిస్తున్నారు
సంగారెడ్డి ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మీట నొక్కితే తెలంగాణలో ఉత్తమ్కుమార్రెడ్డి నటిస్తున్నారని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) తెలుగుదేశం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీడీపీసీసీ)లా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు చోట్ల జరిగిన సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. స్వయంపాలన కోసం తెలంగాణ ఉద్యమం జరిగితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆంధ్రా నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమవుతోందని విమర్శించారు. మహాకూటమిని తెలంగాణ ద్రోహులు, అభివృద్ధి నిరోధకుల కూటమిగా హరీశ్ అభివర్ణించారు.
విదేశాలకు అక్రమంగా మహిళలను రవాణా చేసిన వారికి, అక్రమా స్తులు కూడబెట్టుకున్న వారికి కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకడాన్ని ఆయన తప్పుబట్టారు. తప్పుడు పనులు చేస్తున్న వారిని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయడం లేదో ఉత్తమ్, జానారెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల అక్రమ రవాణా కేసులో జైలుకు వెళ్లిన వారికి కాంగ్రెస్ టికెట్లు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ.. నైతిక విలువలు కలిగిన మనుషులు దొరకడం లేదా అంటూ నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలో 15 మంది నాయకులు ముఖ్యమంత్రి కుర్చీ కోసం పోటీ పడుతున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నేతలు తమ ఆత్మగౌర వాన్ని పదవుల కోసం ఢిల్లీలో తాకట్టు పెట్టార ని సంగారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ అన్నారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా సంగారెడ్డి పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పోతిరెడ్డిపల్లి, మల్కా పూర్, సదాశివపేటలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో హరీశ్ ప్రసంగించారు.
హరీశ్కు తప్పిన ప్రమాదం
హరీశ్ రాక సందర్భంగా సంగారెడ్డిలో టీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. బాణసంచా పేల్చే క్రమంలో అవి గురి తప్పి హరీశ్వైపు దూసుకు వచ్చాయి. వెంటనే వాటిని కొందరు కార్యకర్తలు కాళ్లతో తన్ని పక్కకు నెట్టారు. ఈ సమయంలో ఒక్కసారిగా దట్టంగా పొగ అలుముకోవడంతో అయోమయానికి లోనైన కార్యకర్తలు బైక్లను వదిలి పరుగులు తీశారు. అయితే ఎవరికీ ఏ హాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. హరీశ్కు ప్రమాదం తప్పిందంటూ సామాజిక మాధ్యమాలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వచ్చాయి. విషయం తెలుసుకున్న పార్టీ నేతలు, అభిమానులు హరీశ్కు ఫోన్లు చేసి ఆరా తీశారు. టీవీ చానళ్లలో వార్తలు రావడంతో ఇంటెలిజెన్స్, పోలీసు వర్గాలు ఉరుకులు పరుగులు పెట్టాయి. హరీశ్కు ఫోన్లు వెల్లువెత్తడంతో.. ఎన్నికల ప్రచారర్యాలీలో ఎలాంటి ప్రమాదం జరగలేదని, తాను క్షేమంగా ఉన్నందున మిత్రులు ఆందోళన చెందవద్దని ప్రకటన విడుదల చేశారు.