పచ్చ చొక్కా నేతలకే ఇస్తున్నారు
జన్మభూమి కమిటీ సభ్యులు కమీషన్లు వసూళ్ళు చేస్తున్నారు
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు
సాక్షి, విజయవాడ : ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పెట్టపీట వేశారని భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. కావాలనే తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీపై అబద్దాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం ఏపీకి భారీ స్థాయిలో నిధులు ఇస్తుంటే టీడీపీ తప్పడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ఏపీలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. పేదల కోసం ప్రధాన మంత్రి పట్టణ ఇళ్ల నిర్మాణ పథకం కేంద్రం ప్రవేశ పెట్టారని వెల్లడించారు.
నరేంద్రమోదీ హౌసింగ్ స్కీమ్ కింద ఏపీకి 7లక్షల 42వేల పక్కా గృహాలను కేటాయించినట్లు తెలిపారు. కానీ ఒక్కో ఇంటి నుంచి 30 వేల నుంచి లక్ష వరకు జన్మభూమి కమిటీ సభ్యులు కమీషన్లు వసూళ్ళు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు అందిచాల్సిన వాటిని పచ్చ చొక్కా వాళ్ళకే ఇస్తున్నారని మండిపడ్డారు. నరేంద్రమోదీ ఇళ్ల పధకాన్ని కాస్తా టీడీపీ రాష్ట్ర పధకం కింద మార్చి చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. అవినీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని విమర్శించారు.