మంత్రి అయ్యన్న గంజాయి డాన్‌

Gudivada Amarnath Slams Ayyanna Pathrudu In Praja Sankalpa Yatra - Sakshi

సాక్షి, విశాఖపట్నం:నర్సీపట్నం వేదికగా జరుగుతున్న భారీ గంజాయి వ్యాపారానికి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి అండదండలు పుష్కలంగా ఉన్నాయని వైఎస్సార్‌ సీపీ అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు. గంజాయి వ్యాపారానికి మంత్రి అయ్యన్నే డాన్‌ అని...ఆ విషయం స్వయంగా తోటి మంత్రి గంటా శ్రీనివాసరావే ఆరోపించారని గుర్తు చేశారు. కోటవురట్ల బహిరంగసభలో గుడివాడ ప్రసంగిస్తూ.. అవినీతి నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ విసిరారు.. మీరు అంతటి సాహసం చేయనక్కర్లేదు, త్వరలోనే ప్రజలు మిమ్మల్ని సాగనంపుతారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేరని విషయాన్ని ప్రతిపక్ష నేత ప్రస్తావించారని.. ఆ హామీలు ఏ మేరకు నెరవేర్చారో సమాధానం చెప్పాలన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత మంత్రి అయ్యన్నకు లేదన్నారు.

బాబుకు రోజులు దగ్గరపడ్డాయి..
అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త వరుదు కల్యాణి మాట్లాడుతూ జగన్‌పై కుట్రలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్నారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నారని.. ఎప్పటికైనా భంగపడక తప్పదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్‌ భారతిపై కూడా కుట్ర చేస్తున్నారన్నారు. ఇంత దిగజారుడు రాజకీయాలు చేయడం ఒక్క చంద్రబాబుకే చెల్లిందన్నారు. మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అనిత నియోజకవర్గాన్ని దోచుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రతి పనికీ కమీషన్లు తీసుకుంటూ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top