ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటే ధ్యేయం
లండన్లో ప్రజాకూటమి ఎన్ఆర్ఐల నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటు ధ్యేయంగా పనిచేయాలని ఎన్ఆర్ఐలు నిర్ణయించారు. ఆదివారం లండన్లో టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్ పార్టీ ఎన్ఆర్ఐ శాఖల సమావేశం జరిగింది. ఆయా పార్టీల ఎన్నారై శాఖలు ఎన్నికల్లో నిర్వహించాల్సిన ప్రచారం, గల్ఫ్ భరోసా యాత్ర, కరపత్ర ప్రచారం, యువత, విద్యార్థులతో సమావేశాలు, బహిరంగ సభల్లో ఎన్నారైల తరపున ప్రచారం, సోషల్ మీడియాలో ప్రచారంపై సుదీర్ఘంగా చర్చించినట్టు టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ తెలిపారు.
నియంతృత్వ టీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడి, ప్రజాస్వామ్య ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా పనిచేయనున్నట్టు తెలిపారు. టీడీపీ యూకే–యూరప్ అధ్యక్షుడు జైకుమార్ మాట్లాడుతూ రాబోయేది మహాకూటమి ప్రభుత్వమేనని అన్నారు. టీజేఎస్ యూకే–యూరప్ చైర్మన్ రంగు వెంకట్ మాట్లాడుతూ, జయశంకర్ ఆశయాలను, ఆశలను కేసీఆర్ వమ్ముచేశారని విమర్శించారు. కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ నేతలు సుధాకర్, నర్సింహారెడ్డి, టీడీపీ యూకే యూరప్ నేతలు శ్రీకిరణ్, వేణు, నరేశ్, నవీన్, శ్రీనివాస్, ప్రసన్న, భాస్కర్, రమేశ్, తెలంగాణ జనసమితి ఎన్ఆర్ఐ సెల్ కార్యదర్శులు రవి, వెంకట్స్వామి పాల్గొన్నారు.