అభద్రతతోనే బాబు ఏడుపుగొట్టు రాజకీయం
వైఎస్సార్సీపీ నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు
తెనాలి: కుట్రలు, మోసాలకు పెట్టింది పేరు, అవాస్తవాల ప్రచారంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలుపుపై అభద్రతా భావంతో కొత్తగా ఏడుపుగొట్టు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాలు, క్రమశిక్షణ కమిటీ సభ్యుడు, విజయవాడ పార్లమెంటు పరిశీలకుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు విమర్శించారు. ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా ఓటేస్తే బీజేపీకి వేసినట్టేననడం, తనకు రక్షణ వలయంగా ప్రజలుండాలి అంటూ బేల పలుకులు పలకడం ఇందుకు నిదర్శనమన్నారు. గుంటూరు జిల్లాలోని స్వగ్రామం బుర్రిపాలెంలో తమ ఇంటి వద్ద ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్ర విభజన సహా రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకపోవటం వరకు చంద్రబాబు పాపమేనని ఆరోపించారు. నాడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఆమోదపత్రం ఇచ్చినందునే రాష్ట్ర విభజన జరిగిందని గుర్తుచేశారు. తొలి నుంచీ ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటాలు చేస్తున్నారని వివరించారు. కేంద్రంపై వైఎస్సార్సీపీ అవిశ్వాసం ప్రతిపాదించినా, టీడీపీ సహకరించలేదని గుర్తుచేశారు. హోదా వద్దని నాలుగేళ్లు కేంద్రంతో అంటకాగి ఇప్పుడు కేంద్రంపై దుమ్మెత్తి పోస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి రూ.20 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయనీ, 40 లక్షల ఉద్యోగాలను కల్పించామని పాలకులు చెబుతున్నా, వాస్తవానికి గుంటూరు జిల్లాలో ఒక వెల్డింగ్షాపు కూడా రాలేదన్నారు.