తెలంగాణాలో నలుగురే బాగుపడ్డారు
హైదరాబాద్ : ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తెలంగాణాలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత అనే నలుగురే బాగుపడ్డారని వ్యాక్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..ప్రశ్నించిన వారిని కేసీఆర్ అణిచివేస్తున్నారని మండిపడ్డారు. అధికారం, డబ్బుతో ఇతర పార్టీ నేతలను కేసీఆర్ కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. దళితులకు థర్డ్ డిగ్రీ ..గిరిజనులకు బేడీలు వేసిన ఘనత కేసీఆర్కే దక్కిందని ఎద్దేవా చేశారు.
ఓయూలో యువకుడు చనిపోతే సానుభూతి తెలపడానికి వెళ్లిన ప్రతిపక్ష నేతల పై కేసులు పెట్టి వేధిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. బంగారు తెలంగాణలో బడుగు, బలహీన వర్గాల విద్యా ర్థులకు ఇవ్వడానికి డబ్బులు లేవా? అని ప్రశ్నించారు. ప్రజల్లో చైతన్యం తెచ్చి టీఆర్ఎస్ను గద్దె దింపేందుకు కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్ర ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. అర్హులైన దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలకు జనాభా ప్రతిపాదిక రిజర్వేషన్లు కల్పిస్తానన్న హామీ ఎటుపోయిందని ప్రశ్నించారు. కేసీఆర్ నాలుగేళ్ల పాలనలో తెలంగాణను భ్రష్టు పట్టించారని విమర్శించారు.