మాజీ ఎంపీ రాజీనామా.. ప్రియాంకనే కారణం!
లక్నో : మాజీ ఎంపీ సావిత్రిబాయి పూలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న పూలే ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. అనంతరం గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీచేసి ఓటమి చెందారు. అయితే గత కొద్ది కాలంగా పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడంలేదని భావించిన పూలే.. రాజీనామా చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వైఖరి తీరుకు నిరసనగా పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ఆమె తెలిపారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం ప్రియాంక తనకు ఏమాత్రం మద్దతుగా నిలవలేదని ఆమె ఆరోపించారు.
ఈ సందర్భంగా లక్నోలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. ప్రజలను మోసం చేయడంలో రెండు పార్టీలు ఒకటేనని విమర్శించారు. త్వరలోనే తన సొంత పార్టీని ఏర్పాటు చేయనున్నట్ల ప్రకటించారు. కాగా ఉత్తర ప్రదేశ్కు చెందిన సావిత్రిబాయి పూలే 2000 సంవత్సరంలో బీజేపీలో చేరి 2002, 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. బహ్రైచ్ నియోజకవర్గం నుంచి 2014 సాధారణ ఎన్నికల్లో పోటీచేసి లోక్సభకు ఎంపికయ్యారు. 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు.
మరిన్ని వార్తలు