‘స్టేల’ నష్టానికి ప్రభుత్వానిదే బాధ్యత
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాజెక్టుల నిర్మాణాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడుతున్నందువల్లే నిర్మాణ పనులపై న్యాయస్థానాలు స్టేలు ఇస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులపై స్టే నేపథ్యంలో పనులు నిలిపివేయడం వల్ల రాష్ట్ర ఖజానాపై పడుతున్న భారానికి ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకపాత్ర పోషించిన టీజేఏసీ చైర్మన్ కోదండరాంపై ప్రభుత్వం దాడులు చేయించడం అమానుషమని అన్నారు. సీపీఎం కార్యాలయాలపై బీజేపీ దాడులను కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తెలిపారు. బీజేపీ దాడులకు బెదిరేది లేదని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో హైదరాబాద్లో జరగనున్న సీపీఎం అఖిల భారత 22వ మహాసభలపై సమావేశంలో చర్చించామని, ముసాయిదాను జనవరిలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు.