‘ఎన్నికల బాండు’ల్లో మన సొమ్ము గల్లంతు

Electoral Bonds Are Costing Us - Sakshi

న్యూఢిల్లీ : 2017లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజకీయ పార్టీలకు వ్యక్తులు లేదా సంస్థలు, విరాళంగా ఇచ్చే ‘ఎన్నికల బాండు’లకు సంబంధించి ఆశ్చర్యకరమైన కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ స్కీమ్‌ కింద ఇప్పటి వరకు వివిధ రాజకీయ పార్టీలకు మొత్తం 5,800 కోట్ల రూపాయల బాండులను భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ విడుదల చేయగా, అందులో 95 శాతం నిధులు పాలకపక్ష భారతీయ జనతా పార్టీకే వెళ్లిన విషయం తెల్సిందే. ఈ లావా దేవీలకు సంబంధించి బ్యాంకుకు వెళ్లాల్సిన కమిషన్‌ను గత మే నెల 27వ తేదీ నాటికి 3.24 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వమే చెల్లించినట్లు సామాజిక కార్యకర్త లోకేష్‌ భాత్రా ఆర్‌టీఐ కింద దాఖలు చేసిన దరఖాస్తుకు సమాధానంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

బ్యాంకులు తామందించే ప్రతి సర్వీసుకు కమిషన్‌ లేదా చార్జీలను వినియోగదారుల నుంచే వసూలు చేస్తాయి. ఉదాహరణకు బాంకు నుంచి డిమాండ్‌ డ్రాప్టు తీసుకుంటే తీసుకున్న మొత్తాన్ని బట్టి చార్జీలను వినియోగారుడి నుంచి బ్యాంకులు వసూలు చేస్తాయి. ఇక్కడ ఎన్నికల బాండులను పరిగణలోకి తీసుకుంటే వ్యక్తులు లేదా సంస్థలు, రాజకీయ పార్టీల మధ్య జరిగే లావా దేవీల వ్యవహారం. ఎన్నికల బాండలు తీసుకున్న వ్యక్తులు, లేదా సంస్థలు బ్యాంకు చార్జీలను చెల్లించాలి, అది కాదనుకుంటే ఎన్నికల బాండుల ద్వారా లబ్ధి పొందే రాజకీయ పార్టీలు చెల్లించాలి. ఈ మొత్తం వ్యవహారానికి ఎలాంటి సంబంధంలేని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు కమిషన్‌ చెల్లించడం ఏమిటీ ? అందులోను పన్ను చెల్లింపు దారుల నుంచి సేకరించిన సొమ్మును అటు మళ్లించడం ఏమిటీ?

మొదటి నుంచి ఈ ఎన్నికల బాండులకు సంబంధించి ఎన్నో విమర్శలు వస్తున్నాయి. నల్లడబ్బు రాజకీయ పార్టీలకు చేరకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ఎన్నికల బాండుల విధానాన్ని ప్రవేశపెడుతున్నామని, పెట్టామని మోదీ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఇప్పుడు ఆకాశ రామన్న పేరిట అజ్ఞాత వ్యక్తులు బ్యాంకుల నుంచి ఎన్నికల బాండులు తీసుకుంటున్నారు, వాటిని తీసుకొచ్చి రాజకీయ పార్టీలకు ఇస్తున్నారు. రాజకీయ పార్టీలు మాత్రం వారి వివరాలను నోటు చేసుకుంటున్నాయి. అయితే ఆర్టీఐ చట్టం నుంచి రాజకీయ పార్టీలను మినహాయించడం వల్ల ఆ పార్టీ ఈ ఎన్నికల బాండుల వివరాలను వెల్లడించడం లేదు. బ్యాంకులు వెల్లడించడం లేదు. నిజంగా మోదీ ప్రభుత్వం కోరుకున్నట్లుగా నల్లడబ్బును ఈ విషయంలో అరికట్టాలంటే తాము తీసుకునే ఎన్నికల బాండులకు ఆదాయం పన్ను నుంచి క్లియరెన్స్‌ తీసుకరావాలనే షరతు విధించాలి. అలా విధిస్తే అధికారపక్షానికి ఆశించిన విరాళాలు రావుగనుక అది అంతకు సాహసిస్తుందని ఆశించలేం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top