డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో దాదాపు 40 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేసేందుకు తక్షణమే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు ఆయన మంగళవారం లేఖ రాశారు.
రాష్ట్రం ఏర్పడి మూడున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2008, 2012లో డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, వారికి తప్పకుండా ఉద్యోగాలు ఇస్తామని గతంలో ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు.
కేవలం 8 వేల పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతోందన్నారు. ఇలా అయితే వేలాది మంది నిరుద్యోగులు నిరాశకు గురవుతారన్నారు. జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసి టీచర్ పోస్టుల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు.