స్టేషన్ఘన్పూర్ నుంచే పోటీ చేస్తా..
కేసీఆర్ సర్వే నివేదికతో నేనేంటో తెలుస్తుంది
టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజారపు ప్రతాప్
రఘునాథపల్లి : రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో స్టేషన్ఘన్పూర్ నుంచి పోటీ చేస్తానని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజారపు ప్రతాప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని సెయింట్ మేరీస్ పాఠశాల ఆవరణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలపై జరిగిన సభలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో ప్రజల్లో ఉన్న బలమైన తెలంగాణ ఆకాంక్షతో తాను ఓడానని ఈ సారి అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించాలన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వే వెల్లడి కాలేదని, ఆ సర్వే నివేదికతో ప్రజా బలం ఉన్న తానేంటో తెలుస్తుందన్నారు. తన అభ్యర్థిత్వంపై సీఎంకు స్పష్టమైన అవగాహన ఉందని ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రస్తుత పాలకుడి కన్నా తనకే 100 శాతం సర్వే అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. స్వచ్ఛమైన పాలన అందించేందుకు అవిశ్రాంతిగా కృషి చేస్తోన్న కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా పని చేయడమే తన కర్తవ్యమన్నారు.
అధికారంలో ఉన్నా, లేకున్నా జనం అండతో వారి కోసం నిస్వార్దంగా సేవ చేస్తానని పేర్కొన్నారు. నేడు (సోమవారం) స్టేషన్ఘన్పూర్లో కేసీఆర్కు కృతజ్ఞతగా సభ నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, మహిళలు, ప్రజా సంఘాలు తరలిరావాలని ఆయన పిలుపు నిచ్చారు.
ప్రతాప్కు ఘనస్వాగతం
ప్రభుత్వ పథకాల అమలుపై నిర్వహించిన సభకు వచ్చిన రాజారపు ప్రతాప్కు ఆయన వర్గీయులు బైకు ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి ప్రతాప్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో నాయకులు ఎలపాటి రాంరెడ్డి, బానోతు భిక్షపతినాయక్, కందుకూరి అబ్రహం, యాదగిరి, ఐలోని బాలకృష్ణ, బిర్రు సతీష్, యాక మల్లయ్య, పిట్టల రవి, ముప్పిడి రాజు, దాసరి నాగరాజు, తిరుమల్రెడ్డి, బానోతు రాజు, ఐలోని హరికృష్ణ, జోగురెడ్డి, వంగ వెంకటేష్, గొంగళ్ల రాంచందర్, సెవెళ్ల ఐలయ్య, కుర్ర రాజు, మినుకూరి మధు, కొలిపాక వెంకటేష్, ఇట్టబోయిన సంపత్, ప్రభాకర్; జైహింద్, రాజు, రాజ్కుమార్, జానీ పాషా, ప్రసీబ్, వెంకటయ్య, మదు పాల్గొన్నారు.