జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ బంధువులు తనను టీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలిపారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో గురువారం జగ్గారెడ్డి, విలేకరులతో చిట్ చాట్ చేశారు. తాను గాంధీ భవన్లో ఉంటానో లేక టీఆర్ఎస్ భవన్లో ఉంటానో మే 25 నుంచి 30 వ తారీఖు మధ్య, కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్లోకి పోవాలని జగ్గారెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని జరుగుతున్న ప్రచారం బూటకమని అన్నారు. తాను స్వశక్తిగా ఎదిగాను.. పార్టీ బ్యానర్పై గెలిచిన నేతను కానని స్పష్టంగా పేర్కొన్నారు.
తాను ఏ పార్టీలో ఉన్నా పార్టీ చెప్పింది సగం వింటాను.. మిగతా సగం తన నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్లో కూడా అదిష్టానం చెప్పింది సగం వింటాను.. మిగతా సగం తన నిర్ణయాలు ఉంటాయని స్పష్టంగా పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించి రెండు రాష్ట్రాలు చేయడం వల్ల రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని దెబ్బతిన్నదని వ్యాఖ్యానించారు. తెలంగాణా ఏర్పాటు వల్ల ఇక్కడి ప్రజలకు ఎంత లాభం జరిగిందో తనకు తెలవదన్నారు. కాంగ్రెస్లో అదిష్టానానికి చెప్పాలంటే మధ్యవర్తులకు చెప్పాలి..కానీ ఆ మధ్యవర్తులు అదిష్టానానికి మనం చెప్పింది చెబుతారో లేదో చెప్పలేమని అన్నారు.