హిమాచల్ ప్రదేశ్లో ప్రధాని మోదీ ప్రచారం
షిమ్లా: 'కేంద్రంలో అటల్జీ ప్రభుత్వం, రాష్ట్రంలో ధుమల్ ప్రభుత్వం ఉన్నప్పుడు హిమాచల్ ప్రదేశ్లో ఘణనీయమైన అభివృద్ధి జరిగింది. మళ్లీ అలాంటి అవకాశం మీ ముందు ఉంది' అంటూ హిమాచల్ ప్రదేశ్ ఓటర్లను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రా రైత్ ప్రాంతంలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. "కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరూ ఇక్కడ ప్రచారానికి రావడం లేదు. విధిని నమ్ముకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఎన్నికల క్షేత్రం నుంచి పారిపోయారు' అని మోదీ విమర్శించారు. 'కాంగ్రెస్ పార్టీకి తన నేతలపట్ల విశ్వాసం లేదు. అందుకే ఇతర పార్టీల్లోని రెబల్స్ కోసం ఆశగా చూస్తోంది' అని విమర్శించారు.
నల్లధనంపై తాను పోరాడుతున్నందుకే కాంగ్రెస్ పార్టీ తన దిష్టిబొమ్మలను తగలబెడుతోందని ఆరోపించారు. ప్రజలను దోచుకున్నవారు.. ఆ దోపిడీ సొమ్మును తిరిగి ఇచ్చేంతవరకు.. వారిని తాను ప్రశాంతంగా ఉండనివ్వబోనని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ వీరభూమి అని, ఇక్కడ బీజేపీ విజయాన్ని అడగటానికి తాను రాలేదని, నాలుగింట మూడోంతుల మెజారిటీని తమకు ఇవ్వాలని ప్రజలను కోరేందుకు ఇక్కడికి వచ్చానని ప్రధాని మోదీ అన్నారు.