కాంగ్రెస్ నేతలు క్షమాపణ కోరాలి: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల వెనుక కాషాయ తీవ్రవాదం ఉందంటూ గతంలో కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలు తప్పని కోర్టు తీర్పు స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఆ పార్టీ నేతలు లెంపలేసుకుని క్షమాపణ చెప్పాలని బీజేఎల్పీ నేత కిషన్రెడ్డి డిమాండ్ చేశారు.
పేలుళ్లు జరిగిన సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ, ప్రస్తుత అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు ఈ పేలుళ్లను రాజకీయాలకు వాడుకున్నారని, దేశ ప్రతిష్ట మంటగలిసేలా కాషాయ తీవ్రవాదమనే కొత్త పేరును తెరపైకి తెచ్చారన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తీర్పు వెనక మోదీ హస్తముందని అసదుద్దీన్ వ్యాఖ్యానించటం హాస్యాస్పదమన్నారు.