మేం అందుకు రెడీ.. రేవంత్పై ప్రశంసల జల్లు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో అవినీతి భారీగా పెరిగిపోయిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. సీనియర్ నేత రేవంత్రెడ్డి రాహుల్గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన పుచ్చుకున్న సందర్భంగా ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 'తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి.. మూడున్నరేళ్లు అవుతోంది. ఈ మూడున్నరేళ్ల పాలనలో బడుగు, బలహీన వర్గాలు ఆశలు అడియాసలు కావడమే కాకుండా.. తెలంగాణలో అవినీతి భారీగా పెరిగిపోయింది. వేలకోట్ల రూపాయల దోపిడీ జరిగింది. ప్రజల ఆశలు అడియాసలు కావడమే కాకుండా.. బడుగు, బలహీన వర్గాల ప్రజాస్వామిక హక్కులు కాలరాయబడ్డాయి' అని ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు.
2019లో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వసన్నద్ధంగా ఉందని, ఈ నేపథ్యంలో యంగ్, డైనమిక్, సీనియర్ లీడర్ అయిన రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారని, ఆయనతో పలువురు ప్రముఖ నేతలు సైతంగా కాంగ్రెస్లోకి వచ్చారని ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ కుంతియ సైతం రేవంత్రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. యంగ్, డైనమిక్ లీడర్ అయిన రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే లబ్ధి పొందుతోందని, ఆయన కుటుంబసభ్యులైన ఐదుగురి చుట్టే తెలంగాణలో పాలన సాగుతోందని కుంతియ విమర్శించారు. సోనియాగాంధీ తెలంగాణ ఇస్తేనే కేసీఆర్ సీఎం అయ్యారని గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయారని దుయ్యబట్టారు.