‘మహాకూటమికి 80 సీట్లు వస్తాయి’
సాక్షి, హైదరాబాద్ : నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణను సర్వనాశనం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి రాజీవ్ శుక్లా విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. మోదీ, కేసీఆర్లు ఇద్దరూ అబద్దాల కోరులేనన్నారు.
కేసీఆర్ రాష్ట్రంలోని4000 ప్రభుత్వ పాఠశాలను మూసేసి ప్రైవేట్ పాఠశాలలకు లబ్ది చేశారని ఆరోపించారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్లో వీలీనం చేస్తానని కేసీఆర్ మోసం చేశారన్నారు. మహాకూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ సర్వేల ప్రకారం మహాకూటమి 80 సీట్లు గెలుస్తుందని చెప్పారు. కాంగ్రెస్ సీట్ల ప్రకటన ఆలస్యం చేయడం కూడా తమ వ్యూహమేనన్నారు. పొత్తులు ఉన్నప్పుడు ఇలాంటి వ్యూహాలు సహజమేనని చెప్పుకొచ్చారు. గెలిచే పార్టీ కాబట్టే కాంగ్రెస్ టికెట్లను చాలా మంది ఆశిస్తున్నారన్నారు.