మహా పరిణామాలపై కాంగ్రెస్ ఎంపీల నిరసన
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్రలో ఎన్సీపీ చీలిక వర్గంతో కలిసి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటును నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణలో సోమవారం కాంగ్రెస్ ఎంపీలు నిరసన ప్రదర్శన చేపట్టారు. నిరసన ప్రదర్శనకు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ నేతృత్వం వహించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ఆపాలని, చౌకబారు రాజకీయాలు మానుకోవాలని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. నిరసన ప్రదర్శనలో పార్టీ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మ, అంబికా సోని తదితరులు పాల్గొన్నారు.
ఇక లోక్సభలోనూ మహారాష్ట్ర పరిణామాలపై కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఆందోళనతో లోక్సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. విపక్షాల ఆందోళనతో ఉభయసభలూ వాయిదా పడ్డాయి. మరోవైపు మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి. ఎన్సీపీ రెబల్ ఎమ్మెల్యేలను తిరిగి పార్టీ గూటికి చేర్చేందుకు శరద్ పవార్ పావులు కదుపుతున్నారు. ఇక 24 గంటల్లోగా మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.