లవ్ జిహాద్ చాలా డేంజర్ : యోగి
తిరువనంతపురం : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు కోపం వచ్చింది. కేరళలో ఆరెస్సెస్ నేతల హత్యలు జరుగుతుండటంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే రాజకీయ ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ నేతలను హత్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి హత్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. లవ్ జిహాద్పై కూడా ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
'లవ్ జిహాద్ ఒక అపాయకరమైన సంప్రదాయం. సుప్రీంకోర్టు ఇప్పటికే దానిపై ఆదేశాలు జారీ చేసింది. ఎన్ఐఏ కూడా దర్యాప్తు చేస్తోంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం లవ్ జిహాద్ను బ్యాన్ చేస్తూ చట్టం చేయాలి. మేం కేరళలో చేస్తున్న యాత్ర కమ్యునిస్టు ప్రభుత్వాలకు అద్దంలాంటిది. ఇప్పటికైనా వారు రాజకీయ హత్యలకు ముగింపు పలకాలి' అని ఆయన డిమాండ్ చేశారు. కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యలను నిరసిస్తూ బీజేపీ జన్ రక్ష యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. మంగళవారం ఈ యాత్రను బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రారంభించగా బుధవారం యోగి ఆదిత్యనాథ్ కొనసాగిస్తున్నారు.