నేనే సీనియర్.. నాకన్నీ తెలుసు: చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం/విశాఖ సిటీ: తనపై వస్తున్న అవినీతి ఆరోపణలు నమ్మవద్దని, తన గురించి చెప్పుడు మాటలు వినవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాత్రి విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ‘నమ్మకద్రోహం–కుట్ర రాజకీయాలపై ధర్మపోరాటం’ పేరిట జరిగిన సభలో ఆయన మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లో తానే సీనియర్నని, ఇప్పుడున్న వారంతా తనకంటే జూనియర్లేనని, తనకన్నీ తెలుసని చెప్పుకొచ్చారు. బీజేపీ మిత్రద్రోహం, నమ్మకద్రోహం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ బలపడుతుందని ఎమ్మెల్యే సీట్ల సంఖ్య పెంచలేదని, అది మిత్రద్రోహం కాదా? అని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులిస్తే 2019 నాటికి పూర్తి చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 25 ఎంపీ సీట్లిస్తే ప్రధానమంత్రిగా ఎవరుండాలనేది తామే నిర్ణయిస్తామని పునరుద్ఘాటించారు. రైతు, డ్వాక్రా రుణమాఫీలతోపాటు ఇతర హామీలను చాలావరకు నెరవేర్చానని తెలిపారు. 25 ఏళ్ల క్రితం కంపెనీని(హెరిటేజ్) స్థాపించానని, భవిష్యత్తులో దానిపై వచ్చే ఆదాయంతో తన భార్యే తనకు తిండి పెడుతుందని చంద్రబాబు అన్నారు.
కుట్ర రాజకీయాలు చేస్తే..
బీజేపీ, వైఎస్సార్సీపీలు తనపై, టీడీపీపై కుట్ర చేస్తున్నాయని ముఖ్యమంత్రి ఆరోపించారు. కుట్ర రాజకీయాలు చేస్తే వదిలిపెట్టబోనని హెచ్చరించారు. భవిష్యత్తులో టీడీపీపై మరిన్ని కుట్రలు జరిగే అవకాశం ఉందని, ప్రజలు తనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలు కేంద్రం పక్షాన ఉంటే రాష్ట్రానికి ద్రోహం చేసినట్టేనని తేల్చిచెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో తన పిలుపునకు స్పందించే అక్కడ తెలుగు వారు బీజేపీని ఓడించారని తెలిపారు. ఢిల్లీ నుంచి వస్తున్న స్క్రిప్ట్ ప్రకారమే జనసేన అధినేత పవన్ కల్యాణ్ను తనపైకి ఉసిగొల్పుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. మొన్నటిదాకా తనను పొగడిన పవన్ కల్యాణ్ ఇప్పుడు విమర్శలు చేయడానికి ఇదే కారణమన్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తే తాను అప్పట్లో సహకరించానని, కానీ ఇప్పుడు బ్యాంకుల వద్ద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
పింక్ డైమండ్ కాదు.. కెంపు
టీటీడీ వ్యవహారంలో ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని చంద్రబాబు ఆరోపించారు. శ్రీవారి గులాబీ వజ్రం పోయిందని రమణ దీక్షితులు చెబుతుండడంలో వాస్తవం లేదన్నారు. దీనిపై నియమించిన కమిటీలు అది గులాబీ వజ్రం కాదని, కెంపు అని స్పష్టం చేశాయన్నారు. ఆలయ పోటులో తవ్వకాలు జరిగాయని దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో అనుమానాలు రేకెత్తేలా చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
హైదరాబాద్ అభివృద్ధికి 60 ఏళ్లు కష్టపడ్డాను
‘హైదరాబాద్కు వెళ్లాం.. 60 సంవత్సరాలు నేనే కష్టపడ్డాను. నేనే కష్టపడ్డాను. నిరంతరం శ్రమ చేశాను. ప్రపంచం మొత్తం తిరిగాను. ఈ రోజు హైదరాబాద్ ప్రపంచ పటంలో ఉందంటే ప్రతి అంగుళం నా కష్టార్జితం తప్ప వేరే కాదు’’ విశాఖపట్నంలో టీడీపీ ధర్మ పోరాట దీక్షలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి. 68 ఏళ్ల వయసున్న చంద్రబాబు హైదరాబాద్ కోసం 60 ఏళ్లు కష్టపడ్డానంటూ వ్యాఖ్యానించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాగే దేశంలో బీజేపీపై ఎవరూ పోరాడలేదని, టీడీపీ ఎంపీలే పోరాటం చేశారని వ్యాఖ్యానించారు. రెండు పార్లమెంట్లలోనూ టీడీపీ ఎంపీలు పోరాడారని చెప్పడం గమనార్హం. లోక్సభ, రాజ్యసభ కలిసి పార్లమెంట్ అంటారు. కానీ, దేశంలో రెండు పార్లమెంట్లు ఉన్నట్లుగా చంద్రబాబు చెప్పడం గమనార్హం. రాష్ట్రంలో వేంకటేశ్వరస్వామి పుట్టడం మన అదృష్టమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అడుగడుగునా అధికార దుర్వినియోగం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన టీడీపీ ధర్మపోరాట సభ కోసం అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఎన్నికల సభను తలపించేలా జరిగిన ఈ సభకు జనాల్ని తరలించేందుకు 1,300కు పైగా ఆర్టీసీ బస్సులను మళ్లించారు. బస్సుల మళ్లింపు ద్వారా ఆర్టీసీకి రూ. కోటిన్నరకు పైగా నష్టం వాటిల్లింది. బస్సులన్నీ సీఎం సభకు మళ్లించడంతో మంగళవారం సిటీతో పాటు గ్రామీణ ప్రాంత ప్రయాణికులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సభ కోసం ఏయూ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం వద్ద పోల్స్ నుంచి నేరుగా విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డారు. ఉపాధి కూలీలు, డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలను బలవంతంగా తరలించారు. సీఎం ప్రసంగం ప్రారంభమైన కొద్దిసేపటికే జనం వెళ్లి పోయేందుకు సిద్ధమవగా గ్యాలరీ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో వారితో తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. సుమారు రెండుగంటల పాటు సీఎం ప్రసంగించగా అర గంటలోనే చాలా గ్యాలరీలు ఖాళీ అయిపోయాయి. సీఎం ప్రసంగం పూర్తయ్యే వరకు బస్సులు కదపరాదని ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో జనాలు వాగ్వాదాలకు దిగడం కన్పించింది.
ప్రతిపక్షంపై విమర్శలకే సీఎం ప్రసంగం ప్రధాని నరేంద్ర మోదీ 2014 ఎన్నికల çసభలో, అమరావతి శంకుస్థాపన సందర్భంగా చేసిన ప్రసంగాన్ని ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రదర్శించారు. ఈ సందర్భంగా నాలుగేళ్లలో తాను ఎంతో అభివృద్ధి చేశానంటూ గొప్పలు చెబుతూ ప్రతిపక్షంపై విమర్శలు గుప్పిస్తూ సీఎం ప్రసంగం సాగింది. ప్రతి సందర్భంలోనూ ఉదాహరణలు చెబుతూ తమ్ముళ్లూ మీరే చెప్పాలి అంటూ పదేపదే కోరినా పార్టీ కార్యకర్తల నుంచి స్పందన కరువైంది. చివరకు ప్రత్యేక హోదా– ఆంధ్రుల హక్కు అంటూ బాబు నినాదాలు చేసినా జనం పట్టించుకోలేదు. ఎన్డీఏకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేస్తామని, ఇందుకు మద్దతు కూడగట్టేందుకు నేడు కర్ణాటకలో జరిగే ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.