నేను ప్రధాని అవుతానని చెప్పొద్దు
పార్టీ నేతలకు చంద్రబాబు సూచన
సాక్షి, అమరావతి: తాను ప్రధాని అవుతానని ఎవరూ మాట్లాడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ నాయకులకు సూచించారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను కలపడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలతో ఇబ్బందులొస్తాయన్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బుధవారం టీడీపీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ కమిటీ బాధ్యులతో ఆయన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. నాయకులు అభద్రతకు లోను కావద్దని, వచ్చే ఐదేళ్లలో వారికి మరిన్ని పదవులిస్తామని చంద్రబాబు చెప్పారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను ఊళ్లలోకి రానివ్వని పరిస్థితి ఉందని, స్వయంకృతాపరాధమే కారణమన్నారు.