దర్యాప్తు అధికారులతో సీఎం సిట్టింగ్‌

Chandrababu Sitting with the investigating authorities - Sakshi

విశాఖ ఎయిర్‌పోర్టులో ‘సిట్‌’ అధికారులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ

ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణపై ఆరా

ఒకరోజు ముందు కూడా విజయవాడ వెళ్లి సీఎంను కలిసిన ఇద్దరు అధికారులు

ఇది కేసు విచారణను ప్రభావితం చేయటమే అంటున్న పోలీస్‌ ఉన్నతాధికారులు

విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసును విచారిస్తున్న ‘సిట్‌’ అధికారులతో సీఎం చంద్రబాబు సోమవారం విశాఖ ఎయిర్‌పోర్టులో సమావేశం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కుట్ర గుట్టు వెలుగులోకి రాకుండా ప్రభుత్వ పెద్దలు దర్యాప్తు అధికారులను కట్టడి చేస్తున్నారని, ముందస్తు నిర్ధారణ ప్రకారం విచారణ సాగుతోందనే విమర్శలకు ఇది బలం చేకూరుస్తోంది. మరోవైపు ఈ కేసును విచారిస్తున్న ఇద్దరు కీలక అధికారులు సైతం ఒకటి రెండు రోజుల క్రితం అమరావతి వెళ్లి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు విచారిస్తున్న తరుణంలో అసాధారణ రీతిలో సిట్‌ అధికారులతో చంద్రబాబు సమావేశం కావడం కేసు విచారణను ప్రభావితం చేయటమేనని పరిశీలకులు, న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

సీఎం సార్‌ వస్తున్నారు...
శ్రీకాకుళం పర్యటన కోసం సోమవారం మధ్యాహ్నం 12.50 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు అక్కడే జగన్‌పై హత్యాయత్నం కేసును విచారిస్తున్న సిట్‌ అధికారులతో ప్రత్యేకంగా భేటీ కావడం గమనార్హం. సీఎం వచ్చే సమయానికి సిట్‌ అధికారులు విమానాశ్రయం వద్ద సిద్ధంగా ఉండాలని సీఎంవో నుంచి ఉదయమే విశాఖ పోలీసులకు ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సిట్‌ కార్యాలయంలో విచారణ అధికారి ఏసీపీ నాగేశ్వరరావు వద్దకు వచ్చిన ఓ అధికారి... ‘సీఎం గారు వస్తున్నారు. వెంటనే ఎయిర్‌పోర్టుకు రావాలని సార్‌ చెప్పారు’ అని చెప్పడంతో ఆయన సిబ్బందితో కలసి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. సిట్‌ విచారణను పర్యవేక్షిస్తున్న డీసీపీ నయీం కూడా అంతకుముందే విమానాశ్రయానికి బయలు దేరారు. విశాఖ సీపీ మహేష్‌చంద్ర లడ్హా, డీసీపీ నయీం, సిట్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఏసీపీ నాగేశ్వరరావు, ఇతర అధికారులు విమానాశ్రయం వద్ద కాసేపు విచారణ ప్రక్రియపై సమీక్షించారు. అనంతరం సీపీ మహేష్‌చంద్ర లడ్హా, డీసీపీ నయీం విమానాశ్రయం లోపలికి వెళ్లారు. 

సిట్‌ అధికారులతో సీఎం సమావేశం
విశ్వసనీయ సమాచారం ప్రకారం సీఎం చంద్రబాబు విశాఖ ఎయిర్‌పోర్టులో సీపీ మహేష్‌చంద్ర లడ్హా, డీసీపీ నయీంలతో సమావేశమయ్యారు. ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణ సాగుతున్న తీరుపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశాలు ఎట్టిపరిస్థితుల్లోనూ తెరపైకి రాకుండా చూడాలని సూచించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. నిందితుడి కాల్‌డేటాలో ఉన్న ఫోన్‌ నంబర్ల ఆధారంగా సాక్షుల విచారణ పేరుతో దర్యాప్తును సాగదీయాలనేది ప్రభుత్వ వ్యూహంగా పేర్కొంటున్నారు. 

విజయవాడలో సీఎంను కలసిన ఇద్దరు అధికారులు
ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణ ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే సాగుతోందని పోలీసువర్గాలు స్పష్టం చేస్తున్నాయి. విశాఖలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ పోలీస్‌ ఉన్నతాధికారి మరో కిందిస్థాయి అధికారితో కలసి గుట్టు చప్పుడు కాకుండా విజయవాడ వెళ్లి సీఎంను కలిసిన విషయం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు శ్రీనివాసరావును కస్టడీలోకి తీసుకుని విచారించడంలో ఆ ఉన్నతాధికారితోపాటు కిందిస్థాయి అధికారే కీలకంగా వ్యవహరించారు. అనంతరం వ్యక్తిగత పనుల మీద సెలవుపై వెళ్లిన ఆ ఉన్నతాధికారి ఒకటి రెండు రోజుల క్రితం విజయవాడ వెళ్లారు. కేసు విచారణలో కీలకంగా ఉన్న పోలీస్‌ స్టేషన్‌స్థాయి అధికారి కూడా విశాఖ నుంచి అక్కడకు చేరుకున్నారు. అనంతరం ఆ ఇద్దరు అధికారులు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారని పోలీసువర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో కీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు అధికారులు గోప్యంగా విజయవాడ వెళ్లాల్సిన అవసరం ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. ఇంతలో ఒక్క రోజులోనే సీఎం చంద్రబాబు విమానాశ్రయంలో మరోసారి పోలీసు అధికారులతో సమావేశం కావడం అసాధారణమని అధికారవర్గాలే చెబుతున్నాయి. 

కేసు విచారణపై ప్రతికూల ప్రభావం!
ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం కేసును విచారిస్తున్న సిట్‌ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం ప్రత్యేకంగా భేటీ కావడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దల కుట్రతోనే హత్యాయత్నం జరిగిందన్న ఆరోపణలు ఉన్న కేసులో సీఎం అవాంఛనీయ రీతిలో జోక్యం చేసుకుంటున్నారని ఓ రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి వ్యాఖ్యానించారు. హత్యాయత్నం జరిగిన  పదిరోజుల తరువాత కూడా సూత్రధారుల్లో ఒక్కరి పాత్రను కూడా పోలీసులు బయటపెట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో రాజకీయ జోక్యం కేసు విచారణపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో కుట్ర కోణాన్ని, సూత్రధారుల పాత్రను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top