ప్రాధాన్యం లేదన్నట్టుగా వ్యవహరించండి
వైఎస్ జగన్ మీద హత్యాయత్నంపై మంత్రులకు చంద్రబాబు సూచన
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి మీద జరిగిన హత్యాయత్నంపై అదేపనిగా మాట్లాడవద్దంటూ సీఎం చంద్రబాబునాయుడు తమ పార్టీ నేతలకు సూచించారు. కడప పర్యటనకు బయల్దేరకముందు ఆయన మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ నాయకులతో మాట్లాడారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. జగన్ మీద హత్యాయత్నం ఘటనపై ఆచితూచి స్పందించాలని చంద్రబాబు పార్టీ నాయకులతో అన్నారు. దానికి పెద్దగా ప్రాధాన్యం లేదనే రీతిలో వ్యవహరించాలని సూచించారు. నాయకులు రోజూ దానిపై స్పందిస్తే ఇబ్బందులొస్తాయన్నారు. తమ దృష్టంతా అభివృద్ధిపైనే ఉన్నట్లు చెప్పాలని సూచించారు.
ఈ వ్యవహారంపై పార్టీ నాయకులు పలువురు తీవ్ర స్థాయిలో చేసిన ఆరోపణలు, దూషణలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. వీటివల్ల పార్టీకి ఎంతవరకు ప్రయోజనం చేకూరింది.. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనేదానిపై చర్చించారు. ఘటన జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను వివరించిన చంద్రబాబు.. దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని అభిప్రాయపడినట్లు సమాచారం. అందుకే దీనిపై అతిగా స్పందించవద్దని సూచించారు.
చంద్రబాబుకు అఖిలేష్ ఫోన్: సీఎం చంద్రబాబుకు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మంగళవారం ఫోన్ చేసినట్లు సీఎంవో మీడియా విభాగం తెలిపింది. బీజేపీయేతర భావజాల పార్టీలన్నీ ఒకే వేదిక మీదకు రావాల్సిన అవసరముందని అఖిలేష్ చెప్పినట్లు పేర్కొంది.