విభజన కంటే బాబు దోపిడీ వల్లే ఏపీకి అపారనష్టం

Chandrababu damaging Andhra Pradesh more than bifurcation did - Sakshi

మూడున్నరేళ్లలో 1లక్షా,9వేల కోట్లు అప్పుచేసిన చంద్రబాబు

లెక్కలతో సహా వెల్లడించిన పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

జనం సొమ్మును విచ్చలవిడిగా సొంతపనులకు దుబారా చేస్తోన్న సీఎం

ఎన్నికలప్పుడు బాబులో కనిపించని అనుభవం రేణుకకు ఇప్పుడే కనిపించిందా! అని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్ : మహానగరాన్ని కోల్పోవడమేకాక, మరెన్నో ఇబ్బందుల నడుమ జరిగిన రాష్ట్ర విభజన.. ఆంధ్రప్రదేశ్‌ను తీవ్రంగా నష్టపరిస్తే, అంతకంటే ఎక్కువగా, గడిచిన మూడున్నరేళ్లలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.

టీడీపీ పరిపాలనను చూస్తే భయమేస్తోందని, చంద్రబాబు  రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు చేసిన దోపిడీ కార్యక్రమాల మూలంగా రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బుగ్గన.. టీడీపీ సర్కార్ దుబారా ఖర్చులు, దోపిడీ పాలన తదితర అంశాలపై కీలక విషయాలు చెప్పారు. అయన ఏమన్నారంటే...

‘‘కాగ్‌ నివేదిక ప్రామాణికమే : రాజ్యాంగ సంస్థ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిట్‌ జనరల్‌(కాగ్‌) ఇచ్చిన డాక్యుమెంట్స్‌ ప్రమాణికమైనవి. రాష్ట్రం తరపున అకౌంట్స్ మేనేజ్ చేసేది కూడ కాగే. అది సమర్పించే అంకెల్లో పొరపాట్లకు తావుండదు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ జరిగి ఇప్పటికి 41 నెలలు గడిచాయి. ఈ కాలంలో టీడీపీ సర్కార్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎక్కడికి దిగజార్చారో చూస్తే భయమేస్తోంది. పరిస్థితి ఇలాగే  కొనసాగితే రాష్ట్రాన్ని కాపాడగలగడం వీలవుతుందా అన్నంత భయమేస్తోంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు.. నా అంత అనుభవజ్ఞుడు లేడని ప్రజలను మభ్యపెట్టాడు. కానీ, బాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని దారుణమైన పరిస్థితికి తీసుకుపోయారు. దేశంలో ఇటువంటి ఆర్థిక పరిస్థితి ఏ రాష్ట్రానికి ఉండదు. 2014, జూన్‌ 2 నాటికి ఉమ్మడి రాష్ట్ర అప్పు రూ.1లక్ష 66వేల కోట్లు. జనాభా నిష్పత్తి ప్రకారం ఏపీ 58 శాతం, తెలంగాణ 42 శాతం పరంగా లెక్కేసుకుంటే... ఏపీ 13 జిల్లాల భాగానికి రూ.96వేల కోట్ల అప్పు సంక్రమిస్తుంది. అయితే, ఆగష్టు 2017 నాటికి కాగ్ అప్ లోడ్ చేసిన అంకెల ప్రకారం.. ఏపీ అప్పు రూ.2లక్షల 5వేల కోట్లుగా ఉంది.

ఇదీ.. బాబు బండారం.. : 1956 నుంచి 2014 జూన్ వరకు లెక్కిస్తే, 13 జిల్లాల అప్పు  రూ.96వేల కోట్లు. ప్రస్తుతం(2017కు వచ్చేసరికి) అది రూ.2లక్షల 9వేల కోట్లు! అంటే, వివిధ ప్రభుత్వాలు 60 ఏళ్లలో చేసిన అప్పు కంటే, గడిచిన మూడున్నరేళ్లలో టీడీపీ చేసిన అప్పు అక్షరాలా రూ.1లక్ష 9వేల కోట్లు. సాధారణంగా వంద రూపాయల అప్పుకు వంద ఆస్తి ఉంటే భద్రత బాగున్నట్టు భావిస్తారు. అదే వంద రూపాయల అప్పుకు 150 ఆస్తి ఉంటే ఇంకా సేఫ్టీ. కానీ ఇప్పుడు.. వంద రూపాయలకు అప్పుకు రూ. 46 రూపాయల ఆస్తి మాత్రమే ఉంది!

1994లో బాబు ముఖ్యమంత్రయ్యే నాటికి వంద రూపాయల అప్పుకు ఆస్తి 151 రూపాయలుండేది.  2004లో ఆయన దిగిపోయేటప్పటికి వంద అప్పుకు 46 రూపాయలు మాత్రమే ఆస్తి ఉంది. 2004 నుంచి 2014కు వైయస్ఆర్, రోశయ్య, కిరణ్ ప్రభుత్వంలో వంద అప్పుకు 103 ఆస్తి పెరిగింది. 1991లో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మన అప్పు 21 శాతం ఉండేది. బాబు తొమ్మిదేళ్లలో దాన్ని 32 శాతానికి పెంచాడు. 2004 నుంచి 2014కు వచ్చేనాటికి అప్పటి ప్రభుత్వాలు దాన్ని 22కు తగ్గించాయి. 1956 నుంచి బాబు వచ్చేనాటి దాక రెవెన్యూలోటు లేదు. తన తొమ్మిదేళ్ల పాలనలో ఆయన రూ.22వేల కోట్ల రెవెన్యూ లోటు ఇచ్చారు. 2004 నుంచి 2014కు వచ్చేనాటికి రెవెన్యూలోటు పూడ్చేది కాకుండా 11వేలు రెవెన్యూ ఆధిక్యత పెట్టాడు. ఆనాడు అప్పు చేయకుండానే, రెవెన్యూ లోటు లేకుండానే శ్రీశైలం, నాగార్జున సాగర్‌లు కట్టారన్న విషయం మనం మర్చిపోవద్దు.

నంబర్‌ వన్‌ అంటారు.. ఆదాయం నిల్‌ అంటారు ఏందిది? : దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్ హయాంలో ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టారు. ఆనాడు వైయస్ఆర్ పూర్తి చేసిన 90శాతం కెనాల్ ను వాడుకుంటూ, మిగిలిన పదిశాతం పూర్తి చేసేదానికే చంద్రబాబు ఇంత లోటు చూపిస్తున్నారంటే.. పరిపాలన ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. రూ. లక్ష 9వేల కోట్ల అప్పులో.. 46వేల కోట్లు మాత్రమే వినయోగించి, మిగిలిన 63వేల కోట్లు రెవెన్యూ లోటు పూడ్చేదానికి వాడారు. కదిలిస్తేచాలు.. నాకు ఎంఏ ఎకనామిక్స్, పీహెచ్‌డీ ఇచ్చారు, నా అంత ఎక్స్‌పర్ట్స్ లేరు, నేను బస్సులో పడుకుంటాను, పూరి, ఉప్మాతింటానని చంద్రబాబు  మాట్లాడుతున్నారు. ఏం చెప్పినా ప్రజలు వింటారని ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. లెక్కలతో సహా  మా నాయకుడు వస్తే బాబు తట్టుకోలేక అభివృద్ధికి ఆటంకమంటూ బురదజల్లుతున్నారు.  స్థూల ఉత్పత్తి పెరిగితే ఆదాయం పెరుగుతుందని ఇంటర్ పిల్లోడని అడిగినా చెబుతాడు. కానీ బాబు మాత్రం ప్రతి రోజు స్థూల ఉత్పత్తి పెరుగుతుంది, దేశంలోనే నంబర్ వన్ అంటారు. మరోపక్క, ఆదాయం లేదని చెబుతాడు. ఇది భావ్యమేనా...?

అన్నీ అనవసర ఖర్చులే : పట్టిసీమకు రూ.1600కోట్లు  పెట్టారు.  దీంట్లో వేయి కోట్లు దుబారా అయిందని కాగ్ రిపోర్ట్ లోనే ఉంది. దుబారా జరిగిందని మేం చెబితే ప్రాజెక్టులకు అడ్డం అని మాట్లాడుతారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం అన్నీ టెంపరరీనే. విచ్చలవిడిగా ప్రజాధనం దుర్వనియోగం చేస్తున్నారు.  నా అంత రాజధాని ఎవరూ కట్టలేరంటూ టర్కీ, సింగపూర్, మలేషియా అంటూ అన్ని దేశాలు తిరిగివచ్చారు. ఇప్పుడు మళ్లీ రాజమౌళి, బోయపాటి శ్రీనుల డిజైన్లు అంటున్నారు. వెలగపూడిలో 4 బిల్డింగ్ లకు వేలకోట్లు ఖర్చు చేశారు. వర్షం పడితే పైన ఉండే నీళ్ల కంటే లోపల నీళ్లు ఎక్కువగా కనబడుతున్నాయి. జీవో 22 తీసుకొచ్చి కాంట్రాక్టర్లకు ఎక్కువ రేట్లు ఇచ్చి ముడుపులు తీసుకొంటున్నారు. జీవో 22 మీద 2014 నుంచి కట్టడంలో ఉన్న ప్రాజెక్ట్ లకు ఎంత పేమెంట్ ఇచ్చారంటే అది చెప్పరు. మేం వాస్తవాలతో ప్రభుత్వ అవినీతిని ఎండగడుతుంటే....అభివృద్ధికి అడ్డమని బాబు అభాండాలు వేస్తున్నారు. ఈ ప్రభుత్వం  జలాన్ని కూడ భోంచేస్తోంది.

బుట్టా రేణుకకు ఇప్పుడు గుర్తొచ్చిందా? : టీడీపీలో చేరలేదు మద్దతిస్తున్నానని బుట్టా రేణుక చెబుతోంది. బాబులో అనుభవం ఉందని వెళ్లిందట. మరి మీరు సాధారణ గృహిణి నుంచి  వైయస్సార్సీపీ టికెట్ తరపున డైరెక్ట్ గాఎంపీ అయ్యారు. ఎన్నికలప్పుడు లేని అనుభవం ఆమెకు ఇప్పుడు గుర్తుకువచ్చిందా..? ఇప్పుడు సడన్ గా కనుక్కున్నారా. ఇదేనా అభివృద్ధి? ఎలక్షన్ అయిపోయాక వారం రోజుల్లోనే ఎస్పీవై రోడ్డి వెళ్లిపోయారు. కాంగ్రెస్ లో ఎంపీగా ఉన్నప్పుడు కనబడని అనుభవం ఆయన వారం రోజుల్లోనే కనబడిందట.  బాబుకు అనుభవం ఉన్నప్పుడు టీడీపీలో పోటీ చేయకుండా మా టికెట్ పై ఎందుకు పోటీ చేశారు. వైయస్సార్సీపీ సీటు నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించడం ఏమైనా మాట్లాడితే అభివృద్ధి అని మాట్లాడడం ప్రతి ఒక్కరికి బాగా అలవాటైపోయిందని బుగ్గన మండిపడ్డారు. పదవులకు  రాజీనామా చేయాలని ఫిరాయింపుదారులను డిమాండ్ చేశారు.  టీడీపీ తెలుగు ఎంపీ ఎమ్మెల్యేల సంక్షేమ పథకం అనే కొత్త పథకాన్ని చేపట్టిందని బుగ్గన ఎద్దేవా చేశారు. ఆర్థిక నష్టాలు, ఇబ్బందుల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలను  ఈ పథకంలో మనీ బ్యాక్ గ్యారంటీ స్కీమ్ కింద తీసుకుంటున్నారేమనని ఎద్దేవా చేశారు.

అంతులేని బాబు దుబారా : 2014-15 లెక్కల ప్రకారం చూస్తే  చూస్తే ఏపీకి 16వేల కోట్లు లోటు బడ్జెట్ అంతా బాబు సృష్టించిన కథ అని బుగ్గన అన్నారు. ఖర్చులు ముఖ్యమంత్రికి ముందే ఎలా తెలుస్తుంది. ఏపీకి మొదటి సంవత్సరం లోటు 4వేల కోట్లుంటే కేంద్రం భర్తీ చేశామని చెబుతోంది. 10వేల 500 కోట్లు ఇచ్చామని చెబుతోంది. ఇవి గాక వేయిన్నర వెనుకబడిన జిల్లాలకు, 2500 రాజధానికి, 2900పోలవరంకి ఇచ్చామని చెబుతున్నారు, ఇవన్నీ ఎక్కడపోయాయి. విభజన వల్ల కాదు అన్యాయం జరిగింది, బాబు చేసిన దోపిడీ వలన రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఘంటాపథంగా చెబుతున్నాం. మేం వాస్తవాలను చెబుతున్నాం. ఏపీలో ఓ పౌరునిగా చెబుతున్నా. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మనం, మన పిల్లలు బతికేదెలా అనే బాధతో చెబుతున్నాం. మాట్లాడితే లోటు అంటారు. ఖర్చులు చెప్పమంటే చెప్పరు. విజయవాడ, తిరుపతి, విశాఖ ఎటువెళ్లినా  ప్రైవేటు హెలికాప్టర్ లో వెళ్లడమేంటని బాబును ప్రశ్నించారు.   వైయస్ఆర్ కూడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇండిగో ఫ్లైట్ లో ఎన్నోసార్లు ఫస్ట్ క్లాస్  లేనప్పుడు కూడ తిరిగారు. మనకన్నా బాగున్న మహారాష్ట్ర, కర్నాటక ముఖ్యమంత్రులే కమర్షియల్ హెలికాప్టర్ లో తిరుగుతుంటూ బాబు మాత్రం ప్రైవేటు హెలికాప్టర్ లలో తిరుగుతున్నారు. వీటికి తోడు  హైదరాబాద్ లో, వెలగపూడిలో ఇంటికీ, ఆఫీసుకు కోట్లాది రూపాయలు దుబారా చేశారు. బాబు పెట్టే ఖర్చులన్నీ లెక్కేస్తే రైతు, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ అవుతాయి. బాబుది బ్లండర్, ప్లండర్ ల ప్రభుత్వం. ఈ పద్ధతి మానేయాలి’’ అని బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి హెచ్చరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top