అభ్యర్థులను ముందే ప్రకటిస్తాం
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి
మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్లో చంద్రబాబు
ఐదేళ్లలో ఏం చేశామనేదానిపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామన్న సీఎం
సాక్షి, అమరావతి: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు సూచించారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ముందే ప్రకటిస్తామని పేర్కొన్నారు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, టీడీపీ కార్యకర్తలతో ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆయన బుధవారం టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. కార్యకర్తలందరి ఇళ్లపైనా టీడీపీ జెండాలు ఎగురవేయాలని, మళ్లీ టీడీపీయే రావాలనే నినాదం మార్మోగాలన్నారు.
టీడీపీ రాకపోతే అభివృద్ధి ఆగిపోతుందని, పేదల సంక్షేమం నిలిచిపోతుందనే ప్రచారాన్ని విస్తృతంగా చేయాలని సూచించారు. 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలే లక్ష్యమని, ఎలక్షన్ మిషన్ 2019 జోష్ అందరిలో రావాలన్నారు. డిసెంబర్ చివరివారంలో శ్వేతపత్రాలు విడుదల చేస్తామని, 2014లో ఎక్కడ ఉన్నాం, ఈ ఐదేళ్లలో ఏం చేశాం, 2019–24లో ఏం చేస్తాం అనే అంశాల్ని స్పష్టంగా చెబుతామని అన్నారు.