బలంగా ఉంటే పొత్తులెందుకు?: చాడ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే మహా కూటమితో కలసి పోటీ చేయాల్సిన అవసరమేంటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. మాజీ ఎంపీ అజీజ్పాషాతో కలసి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మహాకూటమి సీట్ల కేటాయింపులపై లీకేజీ వార్తలతో అసలు లక్ష్యానికే నష్టమని హెచ్చరించారు. లీకు వార్తలతో మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీలను బలహీనం చేయాలనుకుంటే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు చవిచూడాల్సి వస్తుందని చెప్పా రు.
సీపీఐ, టీడీపీ, టీజేఎస్ పార్టీలే మహాకూటమి ప్రతిపాదన చేశాయన్నారు. పరస్పర అవగాహన, సీట్ల సర్దుబాటు, ఓట్ల మార్పిడి జరిగితే మహాకూటమి గెలుపునకు తిరుగు ఉండదన్నారు. మహాకూటమిలో భాగంగా సీపీఐ 12 స్థానాల్లో పోటీకి ప్రతిపాదనలు ఇచ్చిందన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏపీ, తెలంగాణల్లో శాసనసభ స్థానాలను పెంచడానికి కేంద్ర హోంశాఖ, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయని.. అలా అయితే అసెంబ్లీ స్థానాలను పెంచిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
రెవెన్యూ చట్టాల ప్రక్షాళనపైనే ప్రధాన దృష్టి..
అమరుల ఎజెండా పేరుతో ఉమ్మడి మేనిఫెస్టోతో మహాకూటమి ఎన్నికలకు వెళ్తుందని చాడ చెప్పారు. సీపీఐ సొంతంగా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తుందన్నారు. రెవెన్యూ చట్టాల ప్రక్షాళనపై సీపీఐ ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించినట్టుగా చెప్పారు. భూములకు కొత్త పాసు పుస్తకాలు.. 2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు.. వంటి వాటిని అమలు చేస్తామన్నారు.
సంబంధిత వార్తలు