బతికే తెలంగాణ కావాలి: చాడ
హైదరాబాద్: కేసీఆర్ చెప్పే బంగారు తెలం గాణ కాదు బతికే తెలంగాణ కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. పోరుబాటలో భాగంగా బస్సుయాత్ర మంగళవారం మల్కాజిగిరి చౌరస్తాకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందని బాధపడ్డామని కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కలలు నెరవేరలేద న్నారు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదని, విద్య నిర్వీర్యమైందని పాఠశాలలు, కళాశాలల్లో కనీస వసతులు లేవన్నారు. 2 లక్షల ఉద్యోగాలిస్తామన్న ప్రభుత్వం ఇప్పటిదాకా 16 వేల ఉద్యోగాలే ఇచ్చిందన్నారు.
కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభు త్వాల పాలన అధ్వానంగా ఉందని విమర్శిం చారు. జీఎస్టీ వలన ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. పోరు బాట ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసి ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. రాజకీయ పార్టీలు, సంఘాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరొక వేదిక ఏర్పాటు చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పోరుబాట బృందం సభ్యులు, జిల్లా నేతలు పాల్గొన్నారు.