హిందువులపై వ్యాఖ్యలు.. కేజ్రీవాల్పై కేసు నమోదు
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా కేజ్రీవాల్ కామెంట్ చేశారని.. బీజేపీ అధికార ప్రతినిధి అశ్విని ఉపాధ్యాయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. యాపిల్ సంస్థ మేనేజర్ వివేక్ తివారిని శుక్రవారం ఉత్తర ప్రదేశ్ పోలీసులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. యూపీలో జరుగుతున్నవి బూటకపు ఎన్కౌంటకర్లని, బీజేపీ హిందువులకు రక్షణ కల్పించడంలో తీవ్రంగా విఫలమైందని కేజ్రీవాల్ విమర్శించారు. అంతటితో ఆగకుండా బీజేపీ నేతలు హిందూ యువతులను లైంగికంగా వేధిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో స్పందించింది. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన మాట్లాడుతున్నారని మండిపడింది. బీజేపీ నేతలు ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 153ఎ, 295ఎ సెక్షన్ల కింద కేజ్రీవాల్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివేక్ తివారిని ఎలాంటి కారణం చూపకుండా యూపీ పోలీసులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. పోలీసుల తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నకిలీ ఎన్కౌంటర్లకు బాధ్యత వహిస్తూ సీఎం యోగి ఆదిత్యానాథ్ పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష ఎస్పీతో సహా, పలు పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
చదవండి : కారు ఆపనందుకు కాల్చేశారు