ఇవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే: బొత్స
సాక్షి, తణుకు : కృష్ణా జిల్లాలో జరిగిన పడవ ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. బుధవారం తణుకులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 21 మంది అమాయకులు మృతి చెందితే ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని విమర్శించారు. అనుమతి లేని బోట్ల నిర్వహణ వెనుక ప్రభుత్వం పెద్దల హస్తం ఉందని, అవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. గోదావరి పుష్కరాల్లో 29మంది అమాయకులు చనిపోతే నేటికీ విచారణ పూర్తికాలేదని మండిపడ్డారు.
విశాఖ భూకుంభకోణం బాధ్యులపై ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇవన్నీ చూస్తే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. గత ప్రభుత్వ హాయాంలో గృహ నిర్మాణ శాఖలో అవినీతి జరిగితే, అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్ల అయినా చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఏమాత్రం దమ్మున్నా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.