ఆ లెక్కలు ఇప్పుడు బయటపెడతా: బొత్స
సాక్షి, అమరావతి: ప్రజల ముంగిట్లోకి పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన వాగ్ధానాలని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కర్నూలు, అమరావతి, ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే సీఎం జగన్ మూడు రాజధానుల విషయంలో నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్క సామాజిక వర్గం కోసం రాజకీయం చేస్తూ గవర్నర్కు లేఖ రాశారని విమర్శించారు. నిపుణుల కమిటీ అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినట్టు చంద్రబాబు పచ్చి అబద్దమాడుతున్నారని మండిపడ్డారు. (దేవుడు కూడా క్షమించడు: మంత్రి బొత్స)
బాబు వేలకోట్ల వృధాకు ప్రయత్నించారు
ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. "శివరామ కృష్ణన్ కమిటీ నివేదికలో మూడు రాజధానుల అంశం కనిపిస్తోంది. అప్పుడు కేంద్రం నియమించిన కమిటీ సైతం మూడు రాజధానుల విషయం ప్రస్తావించింది. కేవలం చంద్రబాబు నాయుడు నియమించిన నారాయణ కమిటీ మాత్రమే అమరావతిని సిఫారసు చేసింది. అది కూడా బాబు చేసిన సిఫారసు. అమరావతి పేరిట వేల కోట్ల వృధాకు బాబు ప్రయత్నించారు. అమరావతి ప్రణాళిక ప్రకారం లక్ష కోట్లు వెచ్చించడం మొదలు పెడితే పూర్తయ్యేసరికి ఐదు లక్షల కోట్లు దాటిపోతుంది" (ఏపీలో కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్ )
కేవలం ప్లాను కోసమే రూ.325 కోట్లు
"అంత డబ్బు వెచ్చించే సామర్థ్యం ఏపీకి ఉందా? ఏపీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కేంద్రం 15 వేల కోట్లు రాష్ట్రానికి ఇచ్చింది. అందులో 7,500 కోట్లు మాత్రమే రాజధాని కోసం వెచ్చించారు. కేవలం రాజధాని నిర్మాణం ప్లాను కోసమే అడ్వాన్స్గా 325 కోట్ల రూపాయలు వెచ్చించారు. 1300 కోట్లు ల్యాండ్ పూలింగ్ కోసం వచ్చినట్టు లెక్కలు తెలుస్తున్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా గతంలో రాజధాని కోసం వృధా చేసిన ధనం గురించి నేను ఇప్పుడు ప్రజల ముందు ఉంచాలి" అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. (చిన్న నగరాలే శ్రేయస్కరం)