ఆప్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎర
ఒక్కొక్కరికి రూ. 10 కోట్లు ఆఫర్ చేసిందన్న సిసోడియా
న్యూఢిల్లీ: తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు, ఒక్కరికి రూ.10 కోట్ల చొప్పున బీజేపీ ఆఫర్ చేసిందని ఆప్ నేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ తీరుపై మండిపడ్డారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు కొనుగోలు చేయడానికి ప్రయత్నించారన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారన్న మోదీ వ్యాఖ్యలపై సిసోడియా మండిపడ్డారు. ప్రధాన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. దేశంలో అమలవుతున్న ప్రజాస్వామ్య విధానాన్ని ప్రధాని గౌరవించాలని సూచించారు. అంతేకాకుండా ప్రజాస్వామ్య విధానం వల్లే మోదీకి ప్రధాని అయ్యే అవకాశం దక్కిందన్నారు.
ఓటమి భయంతోనే: బీజేపీ
అయితే ఆప్ నేతలు చేసిన ఆరోపణలపై బీజేపీ నేతలు స్పందించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయం వల్లే ఆప్ నేతలు బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ నేత అశోక్ గోయల్ అన్నారు.