రాహుల్ 'టెంపుల్ రన్'.. మోదీ మద్దతుదారుల ఝలక్!
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 'టెంపుల్ రన్' కొనసాగిస్తున్నారు. రెండో దఫా ఎన్నికల కోసం ఆదివారం ప్రచార పర్వాన్ని మొదలుపెట్టిన ఆయన ఈ సందర్భంగా మొదట ఖేదా జిల్లాలోని రాంచోడ్జీ ఆలయాన్ని దర్శించుకొని పూజల్లో పాల్గొన్నారు.
గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ ఇటీవల తరచూ ఆలయాలను దర్శించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, తాజా ఆలయ దర్శనం మాత్రం కొంత రచ్చకు దారితీసింది. బీజేపీ మద్దతుదారులు ఆలయం బయట గుమిగూడి.. రాహుల్ను చికాకుపెట్టేందుకు ప్రయత్నించారు. ఆలయాన్ని దర్శించుకొని రాహుల్ బయటకు వస్తుండగా.. పెద్దసంఖ్యలో మూగిన బీజేపీ మద్దతుదారులు గట్టిగా 'మోదీ.. మోదీ' అంటూ నినాదాలు చేశారు. అయితే, వారి నినాదాలకు రాహుల్ వెరవలేదు. ఎప్పటిలాగే నవ్వు చిందిస్తూ.. జనానికి అభివాదం చేస్తూ తన వాహనం ఎక్కి ఆయన ముందుకుసాగారు.