తెలంగాణలో బీజేపీదే అధికారం
బీజేపీ ఢిల్లీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మనోజ్ తివారీ
సాక్షి, హైదరాబాద్: రాబోయే కాలంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ ఢిల్లీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మనోజ్ తివారీ అన్నారు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్తో పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినోత్సవం సందర్భంగా మహిళామోర్చా నిర్వహించిన రక్తదానం.. తదితర కార్యక్రమాల్లోనూ మనోజ్ తివారీ పాల్గొన్నారు.
లక్ష్మణ్తో పాటు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్రావు తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మనోజ్ తివారీ మాట్లాడుతూ అభివృద్ధి, సుపరిపాలన వల్లనే బీజేపీకి దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందన్నారు. బీజేపీ కార్యకర్తలు తెలంగాణలో కష్టపడుతున్నారని చెప్పారు. లక్ష్మణ్ మాట్లాడుతూ దేశమంతా బీజేపీ పవనాలు వీస్తున్నాయని, అమిత్షా నేతృత్వంలో తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ, నేతలు సుభాష్, రాకేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.