యూపీ బీజేపీ ఎంపీ రాజీనామా
ఎస్పీలో చేరిన ఎంపీ రామ్చరిత్ర నిషాద్
లక్నో: సార్వత్రిక ఎన్నికల సమయంలో కీలకమైన ఉత్తరప్రదేశ్లో అధికార బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ రామ్చరిత్ర నిషాద్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సమక్షంలో ఎస్పీ లో చేరారు. గత ఎన్నికల్లో యూపీలోని మచిలీషహర్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన నిషాద్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి అయనకు తిరిగి టికెట్ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించింది. ఇక్కడి నుంచి వీపీ సరోజ్ పేరును బీజేపీ ప్రకటించింది. కాగా సరోజ్ గత ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీచేసి నిషాద్ చేతిలో ఓటమిపాలయ్యారు. నెలక్రితమే బీఎస్పీకి రాజీనామా చేసి.. బీజేపీ గూటికి చేరి.. టికెట్ దక్కించుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నిషాద్ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమి విజయానికి కృషి చేస్తానని రామ్చరిత్ర తెలిపారు.