‘ఏడాదిలో రెండతస్తుల భవనాన్ని నిర్మించలేకపోయారు’
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం చేసే దగా, మోసపూరిత రాజకీయాలకు హైకోర్టు విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న యూటర్న్ నిదర్శనమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హైకోర్టు కావాలని ఇన్ని రోజులు కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి చుట్టూ తిరిగిన టీడీపీ ఎంపీలు ఇప్పుడు కేంద్రాన్ని విమర్శించడం తగదన్నారు. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణ ఏపీలో పర్యటించినప్పుడు హైకోర్టు పనులు డిసెంబర్ కల్లా పూర్తిచేస్తామని ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు.
ఏడాదిలో రెండతస్తుల భవనాన్ని కూడా నిర్మించకపోవడం సీఎం చేతకానితననానికి నిదర్శనం అన్నారు. కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా చంద్రబాబు సుప్రీం కోర్టు, హైకోర్టులను అవమానిస్తున్నారని ఆరోపించారు. హైకోర్టు భవనాలను సకాలంలో పూర్తి చేయలేని రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కారణ కేసు వేయాలన్నారు. ఏపీలో సరైన వసతులు లేవని, నూతన హైకోర్టు ఏర్పాటుకు మరింత సమయం ఇవ్వాలని ఏపీ బార్ కౌన్సిల్ కోరినప్పటికీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. నూతన హైకోర్టు ప్రారంభానికి మరింత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎందుకు అఫిడవిట్ దాఖలు చేయలేదని ప్రశ్నించారు. నూతన హైకోర్టు భవనాలను సకాలంలో పూర్తి చేయలేని సీఎం చంద్రబాబు న్యాయమూర్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.