కర్ణాటక ఫలితాలు చంద్రబాబుకు చెంపపెట్టు
విజయోత్సవ సంబరాలలో బీజేపీ నాయకులు
అనంతపురం కల్చరల్: కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు నమ్మకద్రోహిగా వ్యవహరించిన చంద్రబాబుకు చంపపెట్టుగా ఉన్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షులు అంకాల్రెడ్డి అన్నారు. మంగళవారం వెలువడిన కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ జిల్లా నేతలు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు. బాణసంచా పేలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ ఆనందోత్సవాల్లో మునిగితేలారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ ఎన్ని అడ్డదారులు తొక్కినా ప్రజలు బీజేపీ పైన, మోదీ పనితీరుపైన విశ్వాసం ఉంచడం ఆనందంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నో కీలక రాష్ట్రాలలో అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీ... దక్షిణాదిలో విజయపరంపర కొనసాగించడానికి ప్రయత్నం చేసిందన్నారు. ప్రతిపక్షంలో ఉండి కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిందన్నారు. కర్ణాటకలో తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కర్ణాటకలోని తెలుగు వారిని రెచ్చగొడుతూ పరోక్షంగా కాంగ్రెస్కు సాయపడాలని చూసిన టీడీపీ నాయకులు ఈ ఫలితాలతో దిమ్మదిరిగిందన్నారు. రానున్న ఎన్నికలలో తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ బలపడుతుందనడానికి కర్ణాటక ఎన్నికల ఫలితమే సంకేతమన్నారు. బీజేపీతో నాలుగేళ్లు స్నేహం నటించి ప్యాకేజీకి ఒçప్పుకున్న టీడీపీ... చివరి సంవత్సరంలో సెక్యులర్ అంటూ చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మరన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లలిత్కుమార్, బీజేపీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, రత్నమయ్య, శ్రీనివాసులు, ఆదిలక్ష్మమ్మ, లక్ష్మీదేవి, మహ్మద్రఫీ తదితరులు పాల్గొన్నారు.