రాహుల్ ప్రజాదరణపై మాటల యుద్ధం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ట్వీటర్లో లభిస్తున్న ప్రజాదరణపై బీజేపీ, కాంగ్రెస్ల మధ్య శనివారం మాటల యుద్ధం మొదలైంది. రాహుల్ ట్వీట్లకు రష్యా, ఇండోనేసియా, కజికిస్తాన్ల్లో అధిక సంఖ్యలో రీట్వీట్లు వస్తున్నాయనీ, దీని వెనుక వెబ్ రోబోలు ఉండొచ్చని ఓ వార్తా సంస్థ విశ్లేషించింది.
సమాచార, ప్రసారాల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ స్పందిస్తూ ‘బహుశా రాహుల్ రష్యా, ఇండోనేసియా, కజకిస్తాన్ ఎన్నికల్లోనూ ఘన విజయానికి ప్రణాళికలు రూపొందిస్తూ ఉండొచ్చు’ అని ట్వీట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా రాహుల్ను వెనకేసుకొస్తూ ‘రాహుల్ ప్రజాదరణను చూసి బీజేపీ వాళ్లు భయపడుతున్నారు’ అని అన్నారు.