హామీల అమలుపై చర్చకు సిద్ధమా?
ముఖ్యమంత్రికి కాంగ్రెస్ నేత భట్టి సవాల్
వరంగల్: హామీల అమలుపై చర్చకు తాము సిద్ధమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క అన్నారు. తాము ఇచ్చిన హామీలన్నీ వంద శాతం అమలైనట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని, ఈ విషయమై రాష్ట్రంలో ఎక్కడైనా సరే గ్రామసభ నిర్వహించి రుజువు చేయాలని కోరారు. శనివారం హన్మకొండలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కేజీ టు పీజీ, డబుల్ ఇళ్లు, మూడెకరాల భూమి, ఫీజు రీయింబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ, రుణాలు వంద శాతం అమలు చేసినట్లు ఆ గ్రామ సభలో నిరూపించాలన్నారు. ‘రాష్ట్రం ఏర్పాటు కాంగ్రెస్ పుణ్యమే అని, సోనియా తెలంగాణ తల్లి అని కుటుంబ సభ్యులతో వెళ్లి మోకరిల్లిన నువ్వు.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదనడం మోసపూరిత మాటలకు నిదర్శనం’ అని అన్నారు.
తెలంగాణ ఇవ్వకుంటే సీఎం అయ్యేవాడివా?: పొన్నం
మంకమ్మతోట (కరీంనగర్): కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకుంటే ముఖ్యమంత్రి అయ్యేవాడివా? అని కేసీఆర్కు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కరీంనగర్లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం ఎక్కడుండేదో తెలుసుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ చొరవతోనే తెలంగాణ ఏర్పాటైందని నిండు సభలో ప్రకటించిన కేసీఆర్.. ఇప్పుడు మాటమార్చి ప్రజలను తప్పు దోవపట్టిస్తున్నారని పొన్నం విమర్శించారు.