కేటీఆర్‌.. చరిత్ర చదువుకో

Bhatti vikramarka counter to ktr - Sakshi

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క ధ్వజం 

కాంగ్రెస్‌తో మీకు పోలికా?.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడమని హెచ్చరిక

నెహ్రూ కేబినెట్‌లో ఇందిర లేరు.. ఇందిర దగ్గర రాజీవ్‌ మంత్రి కాలేదు

ప్రధాని పదవిని సోనియా త్యజించారు.. మన్మోహన్‌ కేబినెట్‌లో రాహుల్‌ చేరలేదు

కేసీఆర్‌ పాలన కుటుంబ సభ్యులతో నిండిపోయింది

నీ తండ్రి సీఎం, నీ బావ, నువ్వు మంత్రులు, నీ సోదరి ఎంపీ

అలాంటి మీరా మమ్మల్ని విమర్శించేదంటూ ఫైర్‌

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ను థర్డ్‌ క్లాస్‌ పార్టీగా అభివర్ణించిన మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. దేశంలో కాంగ్రెస్‌ నాయకత్వం చేసినన్ని త్యాగాలు ఏ పార్టీలో చేయలేదని, భారత స్వాతంత్య్ర పోరాట చరిత్ర, కాంగ్రెస్‌ పార్టీ చరిత్ర వేర్వేరు కాదని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌కు అవగాహన లేకపోతే చరిత్ర చదువుకుని కాంగ్రెస్‌ పార్టీ గురించి తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు.

శనివారం అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టి మాట్లాడుతూ..‘వారసత్వం గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదు. ప్రజాస్వామ్య పాలన కోసం దేశానికి కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగం అందించింది. దేశం కోసం నెహ్రూ 16 ఏళ్లు జైల్లో ఉన్నారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నపుడు ఇందిరాగాంధీ మంత్రిగా కూడా పనిచేయలేదు. దేశం కోరుకున్న సమయంలోనే ఆమె ప్రధాని అయ్యారు. ఇందిర హయాంలో ఎంపీగా ఉన్నా రాజీవ్‌ మంత్రి పదవి చేపట్టలేదు.

ఇందిర మరణం తరువాత ప్రధాని అయ్యారు. పార్టీకి నాయకత్వం వహించడం కోసం సోనియాగాంధీకి ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా త్యజించారు. ప్రధాని కావాలని రాహుల్‌పై ఒత్తిడి వచ్చినా మన్మోహన్‌ కేబినెట్‌లో మంత్రి పదవిని కూడా తీసుకోలేదు. మీకు, కాంగ్రెస్‌కు పోలికా? మీ పాలన కుటుంబ సభ్యులతో నిండిపోయింది. నీ తండ్రి ముఖ్యమంత్రి, నీ బావ, నువ్వు మంత్రులు, నీ సోదరి ఎంపీ, ఇటీవలే ఇంకో బంధువు ఎంపీ అయ్యారు. నీకు సోనియాగాంధీ గురించి మాట్లాడే అర్హత ఉందా? నీవు మాట్లాడేవి లేకి మాటలు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది’అని భట్టి హెచ్చరించారు.  

రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు
ధనిక రాష్ట్రం తెలంగాణను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పులపాలు చేసిందని భట్టి విక్రమార్క విమర్శించారు. ‘కాంగ్రెస్‌ పార్టీ చెప్పిన విషయాలే గణాంకాలతో సహా కాగ్‌ వివరించింది. వీటన్నింటినీ నిలదీస్తామనే మమ్మల్ని బయటకు పంపించేశారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టక ముందే ప్రధాన ప్రతిపక్షాన్ని సస్పెండ్‌ చేసి ప్రమాదకర సంప్రదాయానికి తెరతీశారు.’అని దుయ్యబట్టారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లెక్కలు గజిబిజిగా మార్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేస్తూ అద్భుతంగా పాలన సాగిస్తున్నట్లు కేసీఆర్‌ మభ్య పెడుతున్నారని విమర్శించారు. ఎïస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద 55 శాతమే ఖర్చు చేశారని.. మిగిలిన సొమ్మును వచ్చే ఏడాదికి జమ చేయాల్సి ఉన్నా మూడేళ్లుగా అలా జరగలేదని కాగ్‌ చెప్పిందని, సబ్‌ప్లాన్‌ చట్టాన్ని తుంగలో తొక్కారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు.

విద్యుత్‌ కొనుగోళ్లలోనూ కాగ్‌ తూర్పారబట్టిందని, కాగ్‌ నివేదికకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి పెను విఘాతంలా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని నిప్పులు చెరిగారు. ప్రతిపక్షాలు లేకుండా బడ్జెట్‌ సమావేశాలు పూర్తి చేసుకోవడం విచారకరమన్న హరీశ్‌ వ్యాఖ్యలపై భట్టి స్పందిస్తూ.. సస్పెన్షన్‌ తీర్మానం చదివి విచారకరం అనడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శించారు.

పాదయాత్రపై త్వరలోనే ప్రకటన
తాను చేపట్టబోయే పాదయాత్రపై పార్టీ పరంగా త్వరలోనే ప్రకటన వస్తుందని భట్టి చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాగిస్తున్న అప్రజాస్వామిక పాలనను ప్రజలకు వివరించేందుకు పాదయాత్ర చేస్తున్నానని, ఈ విషయమై ఇప్పటికే పార్టీ హైకమాండ్‌కు నివేదిక వెళ్లిందన్నారు. ఎప్పుడు, ఎక్కడ యాత్ర చేయాలో పార్టీనే ప్రకటిస్తుందన్నారు. ఈసారి ఎన్నికల్లో తన కుటుంబం నుంచి మరొకరు పోటీచేస్తారన్న వార్తలను భట్టి ఖండించారు. తన భార్యకు ఆ ఆలోచన లేదని, ఖమ్మం జిల్లాలో పార్టీ కోసం పనిచేస్తున్న వారు అనేక మంది ఉన్నారని, వారికి అవకాశం ఇవ్వాలని పార్టీని కోరారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top