ఇది కార్పొరేట్ శక్తుల బడ్జెట్: భట్టి
సాక్షి, హైదరాబాద్: ‘కేంద్రం ప్రవేశపెట్టింది సామాన్యుల బడ్జెట్ కాదు. కార్పొరేట్ శక్తుల కోసం పెట్టింది’అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క అన్నారు. గాంధీభవన్లో శుక్రవారం ఆయన మాట్లా డుతూ రాష్ట్ర ప్రజలను కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచిందని అన్నారు. ప్రధాని మోదీ మాటలతో మాయ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
పత్తి క్వింటాలుకు రూ. 6 వేలు ఖర్చు అవుతున్నదని కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైస్(సీఏసీపీ) చెబుతుంటే, మద్దతు ధరను రూ.4 వేలు ప్రకటించిందని, ఇది మద్దతు ధర ఎలా అవుతుందన్నారు. 2016–17లో ప్రకటించిన ఆరోగ్య బీమాను ఇప్పటికీ అమలు చేయని కేంద్రం కొత్తగా ఐదు లక్షల బీమా అంటున్నదని ఎద్దేవా చేశారు.
తెలు గు రాష్ట్రాలకు బడ్జెట్లో తీవ్రంగా అన్యాయం చేసిందన్నారు. రాష్ట్రానికి ఎలాంటి హామీలు, కేటాయింపులు లేకున్నా సీఎం కేసీఆర్ ఎందుకు నోరు విప్పడంలేదని, మోదీతో సీఎంకు ఉన్న లాలూచీ ఏమి టని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన తప్పులకు ప్రధాని ఉచ్చు బిగిస్తారనే భయంతోనే నోరువిప్పడం లేదని ఆరోపించారు. ఒక్కసారి ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని ఎంపీ కవిత మాట్లాడటం సరికాదని, గతంలో టీఆర్ఎస్ ఎక్కడెక్కడ, ఎన్నిసార్లు ఓడిపోయిందో ఆమెకు గుర్తులేదా అని ప్రశ్నించారు.