కొత్తగా ఒక్క పరిశ్రమ రాలేదు
అసెంబ్లీలో ప్రభుత్వంపై భట్టి విక్రమార్క విమర్శలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఆరోపించారు. శుక్రవారం పద్దులపై చర్చ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్లో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని విమర్శించారు. బీహెచ్ఈఎల్, బీఈఎంఎల్, ఈసీఐఎల్, హైటెక్ సిటీ, సెజ్ల వంటివి గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో వచ్చినవేనని పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటీ, ఐఐటీ వంటివి కూడా గతం లోనే వచ్చాయన్నారు.
సహజ సిద్ధంగా జరిగే అభివృద్ధిని కూడా ఈ ప్రభుత్వం తన ఘనతగా చెప్పుకుంటోందని దుయ్యబట్టారు. పాత ప్రాజెక్టుల ముందు నిల్చుని ఫొటోలు దిగి ప్రచారం చేసుకోవడం తప్ప ఏమీ చేయలేదని తీవ్ర ఆరోపణలు చేశారు.సీఎం జిల్లా మెదక్ అభివృద్ధికి ఏం చేశారని ప్రశ్నించారు. ఆ జిల్లాలో నిమ్జ్కు ఏం చేశారని ప్రశ్నించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్లాంట్లను కేంద్రంతో పోరాడి ఎందుకు సాధించలేదని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని దివాలా తీయించారన్నారు.
పోడు భూములు లాక్కోవడమేంటి?
‘దళితులు, బలహీన వర్గాల కోసం మూడెకరాలు ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ ఓట్లు కూడా వేయించుకుంది. ఇప్పుడేమో పోడు భూములను అధికారులు లాక్కున్నారు’ అని భట్టి ఆరోపించారు. ఆరేళ్లుగా గ్రూప్–1 ఉద్యోగాల నోటిఫికేషన్ జారీకాలేదని, అనేకమంది నిరుద్యోగులు వయసు మించిపోయి అర్హత కోల్పోయే పరిస్థితి నెలకొందని విచారం వ్యక్తం చేశారు.
నిజాం ఫ్యాక్టరీ సంగతేంటి
నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తారా లేదా అని భట్టి ప్రశ్నించారు. పర్యాటకరంగ అభివృద్ధికి కేంద్రం నిధులిచ్చినా యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో అవి నిలిచిపోయాయ న్నారు. హైదరాబాద్ చిత్రపురికాలనీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. హైదరాబాద్లోని మ్యాన్హోల్స్లో పనిచేస్తున్న కార్మికులు అనారోగ్యానికి గురవుతున్నారని, వారికి గ్లౌవ్స్, మాస్కులు వాడేలా చర్య లు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ను కోరా రు. సింగరేణిలో కారుణ్య నియా మకాలు చేపట్టట్లేదని అనడంతో టీఆర్ ఎస్ సభ్యుడు బాల్క సుమన్ అడ్డుతగులుతూ కారుణ్య నియామకాలు చేపడుతున్నారని పేర్కొన్నారు.