ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంట నష్టం: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఆరోపించారు. రైతులు ధాన్యాన్ని మార్కెట్ యార్డులకు ఎప్పుడో తీసుకొచ్చినా దాన్ని సకాలంలో కొనకుండా కాలయాపన చేశారని, ఈలోపు వానలు కురిసి ధాన్యం తడిసిపోయిందన్నారు.
తెచ్చిన ధాన్యాన్ని తెచ్చినట్టు కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం వహించడంతో దాదాపు 3 లక్షల టన్నుల ధాన్యం తడిసిపోయిందని, ఇందుకు మంత్రి హరీశ్రావు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల పూర్వపు నల్లగొండ జిల్లాల్లోని పలు మార్కెట్లు, ఐకేపీ కేంద్రాలను సందర్శించి వచ్చిన దత్తాత్రేయ ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తడిసిపోయిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, రైతులకు నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.