టీఆర్ఎస్ నేతలపై అట్రాసిటీ కేసు పెట్టాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ కమిషనర్ రవిబాబుపై టీఆర్ఎస్ నాయకుల దాడిని తమ పార్టీ ఖండిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కులం పేరుతో దూషిస్తూ, భౌతిక దాడులకు పాల్పడుతున్న టీఆర్ఎస్ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
రోడ్లపై అధికార పార్టీ సహా ఏ రాజకీయ పార్టీ ఫ్లెక్సీలు పెట్టినా, చివరకు తన ఫ్లెక్సీలు పెట్టినా తొలగించాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గతంలో ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. అందులో భాగంగానే మున్సిపల్ కమిషనర్ రవిబాబు ఇటీవల ఇల్లందులో ఏర్పాటు చేసిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రుల ఫ్లెక్సీలు తొలగించారని చెప్పారు. దీనికి రెచ్చిపోయిన టీఆర్ఎస్ నాయకులు కమిషనర్ ఇంటికి వెళ్లి మరీ దాడికి దిగారన్నారు. అధికారులపై దాడులు జరిగితే వారు మానసిక స్థైర్యాన్ని కోల్పోతారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు