జైట్లీ పొలిటికల్ ఆల్ రౌండర్ : రాంమాధవ్‌

Arun Jaitley Is An Political All Rounder, says Ram madhav - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత  అరుణ్‌ జైట్లీ  మృతి పట్ల ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ తీవ్ర సంతాపం ప్రకటించారు. నాయకులుగా అందరూ ఎదుగుతారని, అయితే నాయకుడిగా ఎదిగి సంస్థగా మారిన వ్యక్తి  జైట్లీ అని ప్రశంసించారు. అందరికీ అందుబాటులో ఉండే స్వభావం జైట్లీదని, రాజకీయాల్లో హాస్యరసం పూయించడం ఆయన ప్రత్యేకత అని రాంమాధవ్‌ గుర్తు చేసుకున్నారు. 

శనివారం హైదరాబాద్‌లో రాంమాధవ్‌ మాట్లాడుతూ..నెల రోజుల వ్యవధిలోనే పెద్ద నాయకులను బీజేపీ కోల్పోయిందని అన్నారు. జైట్లీ పొలిటికల్‌ ఆల్‌ రౌండర్‌ అని, అంచెలంచెలుగా ఎదిగి పార్టీలో ఉన్నత పదవులు అందుకున్నారన్నారు. ఆయన ప్రతిభ, కష్టపడే తత్వం అత్యంత యోగ్యుడిగా మార్చిందన‍్నారు. ఆర్థిక, రక్షణ మంత్రిత్వ శాఖలను అవలీలగా నిర్వర్తించేవారని ప్రశంసలు కురిపించారు. న్యాయశాఖలోనూ జైట్లీ నిపుణులని, పార్టీలో న‍్యాయ సలహాలు ఆయనే ఇచ్చేవారన్నారు. 

అరుణ్‌ జైట్లీ: క్రికెట్‌తో ఎనలేని అనుబంధం 

రాత్రి ఒంటి గంట అయినా జైట్లీ బడ్జెట్‌పై కసరత్తు చేసేవారని రాంమాధవ్‌ గుర్తు చేసుకున్నారు. కశ్మీర్‌లో పొత్తులపై కూడా అరుణ్‌ జైట్లీ అభిప్రాయం తీసుకోమని ప్రధాని మోదీ చెప్పేవారన్నారు. ​క్రికెట్‌ అంటే ఆయనకు ఎంతో అభిమానం అని, బీజేపీకి జైట్లీ మంచి బ్యాట్స్‌మెన్‌ అన్నారు. ‘విపక్షాల వికెట్లు తీయడంలో మంచి బౌలర్‌..సమస్యలను పరిష్కరించడంలో మంచి ఫీల్డర్‌’ అని వ్యాఖ్యానించారు. రాజకీయాలు అంటేనే అధికారం కోసం అని, అయితే మానవీయత కోసం అనే వ్యక్తి జైట్లీ అని రాంమాధవ్‌ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున‍్నట్లు తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top