జన సంద్రం.. అభిమాన ప్రకాశం
ప్రకాశం జిల్లాలోకి అడుగిడిన ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు, ప్రజలు
1200 కిలోమీటర్ల మైలు రాయి దాటిన పాదయాత్ర
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శుక్ర వారం 89వ రోజు ప్రకాశం జిల్లాలో అడుగు పెట్టిన ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం తూర్పుపాలెం క్రాస్ వద్ద నుంచి ఉదయం ప్రారంభమైన పాదయాత్ర కాసేపటికి ప్రకాశం సరిహద్దుకు చేరుకుంది. ఆ సమయంలో అటు నెల్లూరు జిల్లా నేతలు, ప్రజలు భారీగా హాజరై జననేతకు వీడ్కోలు పలుకగా.. ఇటు అంతే స్థాయిలో ప్రకాశం జిల్లా పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
కందుకూరు నియోజకవర్గంలోని లింగసముద్రం మండలం రాళ్లపాడు రిజర్వాయర్ ముఖద్వారం వద్దకు జగన్ రాగానే వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతించారు. క్రైస్తవ, ముస్లిం మత గురువులు జగన్ యాత్ర దిగ్విజయంగా సాగాలని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న జనం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్య కర్తలతో ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది. రాళ్లపాడు రిజర్వాయర్ కట్టపై పాదయాత్ర సాగుతున్నప్పుడు అక్కచెల్లెమ్మలు ఇరు వైపు లా నిలుచుని జననేతకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఇదే సమయంలో ఓ స్థానిక రైతు రాళ్లపాడు ప్రాజెక్టు దుస్థితి గురించి జననేతకు విన్నవించాడు. ‘80 శాతం పనులు మహానేత హయాంలోనే పూర్తయ్యాయి. మిగిలిన 20 శాతం పనులను కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై జగన్ స్పందిస్తూ.. మనందరి ప్రభుత్వం రాగానే ఇలాంటి ప్రాజెక్టులన్నింటినీ సత్వరమే పూర్తి చేసుకుందామని చెప్పారు. కొంచెం ముందుకెళ్లాక.. పలు వురు బ్రాహ్మణులు జగన్ వద్దకు వచ్చారు. రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆవే దన వ్యక్తం చేస్తూ.. దీనిపై దృష్టి పెట్టాలని ప్రతిపక్ష నేతకు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తేనే తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వినతుల వెల్లువ..
వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి మొదలైన పాదయాత్ర ప్రకాశం జిల్లాలో అడుగిడగానే మరో మైలు రాయిని అధిగమించింది. లింగసముద్రం నుంచి భోజనానంతరం బయలుదేరిన జగన్ రామకృష్ణాపురం హైస్కూల్ వద్దకు రాగానే 1200 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించారు. ఇందుకు గుర్తుగా అక్కడ ఒక మొక్కను నాటారు. ఈ గ్రామంలో అక్కచెల్లెమ్మలు జగన్కు రంగ వల్లులతో స్వాగతం పలికారు. మరోవైపు.. రాష్ట్రంలో దుల్హన్ పథకం సరిగ్గా అమలు జరగడం లేదని లింగ సముద్రంలో ముస్లిం మహిళలు జగన్ దృష్టికి తెచ్చారు. వడ్రంగి పని చేసే వారు, అంగన్వాడీ కార్యకర్తలు, అవ్వా తాతలు, రైతులు.. ఇలా వివిధ వర్గాల ప్రజలు తమ కష్టాలు చెప్పుకొన్నారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు ఆది మూలపు సురేష్, జంకె వెంకటరెడ్డి, కాకాణి గోవర్థన్రెడ్డి, మేకపాటి గౌతమ్రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కందుకూరు, ఉదయగిరి, కోవూరు నియో జకవర్గాల సమన్వయకర్తలు తూమాటి మాధవరావు, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి తదితర నేతలు జగన్తో కలిసి నడిచారు.