‘50 ఏళ్ల వరకు అధికారం మాదే’
సాక్షి, న్యూఢిల్లీ: రాబోయే 50 ఏళ్ల వరకు బీజేపీని ఎవరు ఓడించలేరని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఆ తర్వాత మోదీ మాట్లాడుతూ.. అజేయ భారత్-అటల్ భారత్ అనే నినాదంతో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. ఒకరి పక్కన ఒకరు నిలబడని పార్టీల నాయకులు.. ఇప్పుడు చేతులు కలుపుతున్నారని విమర్శించారు. అబద్దాల ఆధారంగా మహా కూటమిని ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు.
మహా కూటమికి నాయకత్వం ఎవరో తెలియని పరిస్థితి నెలకొందని.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కూటమి పార్టీలు మాత్రమే కాకుండా, ఆ పార్టీలోనే ఎవరు అంగీకరించడం లేదని ఆరోపించారు. పరిపాలనలో విఫలమైన వారు ప్రతిపక్షంలో కూడా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ 48 సంవత్సరాల పాలనకు, తమ ప్రభుత్వం 40 నెలల పాలనను పోల్చి చూడాలని కోరారు.